
తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభేధాలు పక్కన పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. హస్తం పార్టీ నేతలందరితో సమావేశమయ్యానని.. అందరి అభిప్రాయాలు తీసుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి వేడుకుంటున్నా..ఏమైనా విబేధాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని కోరారు. కలిసికట్టుగా ఉంటేనే బీఆర్ఎస్, బీజేపీని ఓడించగలుగుతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. ఎంత పెద్దనేతలైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని..అలా కాకుండా రోడ్డెక్కి రచ్చ చేసుకోవద్దని సూచించారు.