ప్రైవేటు ల్యాబ్​లతో ఎంజీఎం సిబ్బంది కుమ్మక్కు

ప్రైవేటు ల్యాబ్​లతో ఎంజీఎం సిబ్బంది కుమ్మక్కు
  • దర్జాగా శాంపిల్స్​ తీసుకెళ్తున్న  ప్రైవేట్​ ల్యాబ్​ సిబ్బంది
  • లైట్​ తీసుకుంటున్న పెద్దాఫీసర్లు
  • ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు

హనుమకొండ, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంలో ట్రీట్​మెంట్ అందాలంటే చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలకు ఫ్రీగా టెస్టులు చేసి.. మందులు అందించాల్సిన డాక్టర్లు, సిబ్బంది ప్రైవేటు ల్యాబ్​లతో చేతులు కలిపి పేషెంట్లను నిలువునా ముంచుతున్నారు. కేవలం టెస్టులే కాకుండా పేషెంట్లకు రాసే మందుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్​లో పైసలు ఖర్చు పెట్టే స్థోమత లేని వందలాది మంది నిరుపేదలు ఎంజీఎం హాస్పిటల్​కు తరలివస్తుంటారు. ఇలా రోజూ మూడు నుంచి నాలుగు వేల మంది ఓపీ సేవల కోసం వస్తుండగా.. రెండు నుంచి మూడు వందల మంది ఇన్​ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. కాగా ఇన్​ పేషెంట్లకు టెస్టులు చేసేందుకు ఎంజీఎంలో అన్ని రకాల ల్యాబ్​ ఎక్విప్​మెంట్​అందుబాటులో ఉన్నాయి. అందులో ఉన్న సిబ్బంది దాదాపు 50 రకాల టెస్టులు కూడా చేస్తున్నారు. ఇంత ఎక్విప్​ మెంట్, ల్యాబ్​ టెక్నీషియన్స్​  ఉన్నా.. పేషెంట్లు ప్రైవేటు ల్యాబ్​ల్లోనే టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొత్త పేషెంట్​అడ్మిట్ అయిన వెంటనే ప్రైవేటు ల్యాబ్​ల సిబ్బందికి సమాచారం అందుతోంది. ఆ వెంటనే వారు వార్డుల్లోకి ఎంటరై నేరుగా పేషెంట్ల దగ్గరకు వెళ్తున్నారు.  ప్రతి బెడ్​దగ్గరకు వెళ్లి ‘ఎంజీఎంలో టెస్టులు లేట్​గా చేస్తరు.. మా ల్యాబ్​ లో చేయించుకోండి’ అంటూ బేరం ఆడుతున్నారు. వేరే ల్యాబ్​ లలో పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని, తమ ల్యాబ్​ లో డిస్కౌంట్ ఇస్తున్నామంటూ మాయమాటలు చెప్పి పేషెంట్లను బుట్టలో వేసుకుంటున్నారు. 

కమీషన్ల కోసం అవసరం లేని టెస్టులు

ఎంజీఎం ఆసుపత్రిలోని కొంతమంది నర్సులు, డాక్టర్లు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు ల్యాబ్​ల సిబ్బందికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎంజీఎంతో పాటు కేఎంసీ సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​లో అన్ని రకాల టెస్టులు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్విప్​ మెంట్​ లేకుంటే ఎంజీఎం డాక్టర్ల రిఫరెన్స్​మేరకు ప్రైవేట్​ల్యాబ్స్​కు పంపించాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. కొంతమంది సిబ్బంది ప్రైవేటు ల్యాబ్​లతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని  శాంపిల్స్ అన్నీ ప్రైవేటు సిబ్బంది చేతిలో పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రతీ టెస్టుకు కమీషన్​ అందుతుండటంతో పేషెంట్లకు అవసరం లేని టెస్టులు కూడా రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రైవేటు ల్యాబ్​ల బాగోతంలో ఎంజీఎం ఆసుపత్రికి చెందిన ఓ పెద్ద డాక్టర్​ పాత్ర కూడా ప్రధానంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద డాక్టర్​ సూచన మేరకు ఎంజీఎం ఎదురుగానే ఓ ప్రైవేటు ల్యాబ్​ ఏర్పాటు చేసి దందా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్​ ల దందా ఎప్పటినుంచో సాగుతోంది. హాస్పిటల్​ పెద్ద డాక్టర్ల ముందే ప్రైవేట్​ల్యాబ్​ల సిబ్బంది పేషెంట్​ల నుంచి శాంపిల్స్​ తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీంతో గతంలో ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ‘ప్రైవేటు ల్యాబ్​ సిబ్బంది ఎంజీఎం లోపలికి రాకూడదు’ అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకట్రెండు రోజులు సీరియస్​గా వ్యవహరించి ఆ తరువాత లైట్​ తీసుకున్నారు. దీంతో ప్రైవేట్​ ల్యాబ్​ల దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు.

మందులదీ అదే తీరు

ఓ వైపు ఎంజీఎంలో ప్రైవేట్​ల్యాబ్​ల దందా నడుస్తుంటే.. మరో వైపు పేషెంట్లకు రాసే మందుల విషయంలోనూ అదే జరుగుతోంది. పేషెంట్లకు ఆసుపత్రి ఫార్మసీలో దొరికే మందులు కాకుండా వేరే కంపెనీలకు సంబంధించిన మెడిసిన్​ రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ వివిధ మెడికల్ ఏజెన్సీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్​ హాస్పిటల్​కు రావడం.. వారి మందులు మాత్రమే రాసేలా చూడాలంటూ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ఎంజీఎం డాక్టర్లు కూడా మెడిసిన్​ బయటకు రాస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి మెడికల్​ రిప్రజెంటేటివ్స్​ ఎంటర్​ కాకూడదన్న నిబంధన ఉంది.  కానీ డాక్టర్ల ఎంకరేజ్​మెంట్​ వల్ల మెడికల్ ఏజెన్సీల ప్రతినిధులు వార్డుల్లో యథేచ్ఛగా తిరగడమే కాకుండా.. డ్యూటీ టైమ్​లో డాక్టర్ల క్యాబిన్​లలో చర్చలు జరుపుతున్నారు. దీంతో పేషెంట్లు మెడిసిన్​ కోసం ప్రైవేటు మెడికల్​ షాపులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా ఎంజీఎంలో దందా సాగిస్తున్న ప్రైవేట్​ ల్యాబ్​ లు,  మెడికల్​ ఏజెన్సీలకు చెక్​ పెట్టాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకుండా చర్యలు తీసుకోవాలని పేషెంట్లు, వారి బంధువులు కోరుతున్నారు. 
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్​కు చెందిన నాగరాజు ఏప్రిల్​ 10న వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్​అయ్యాడు. అనంతరం పెద్ద డాక్టర్లను సంప్రదిస్తే అంతా బాగానే ఉందని, మందులు రాసి అబ్జర్వేషన్​ లో పెట్టారు. ఎలాంటి టెస్టులూ అవసరం లేదని చెప్పారు. కానీ అక్కడున్న సిబ్బంది ఒకరు నాగరాజుకు అవసరం లేకపోయినా ఓ టెస్ట్​ రాశారు. ఆ టెస్ట్​ ఇక్కడ చేయరని చెప్పి.. ప్రైవేటు ల్యాబ్​ సిబ్బందికి అప్పగించారు. దీంతో ప్రైవేటు ల్యాబ్​ సిబ్బంది దర్జాగా ఆసుపత్రి లోపలికి వచ్చి శాంపిల్స్​ తీసుకుని వెళ్లారు. ఆ ప్రైవేట్​ల్యాబ్​రిఫరెన్స్​ మీదనే శాంపిల్స్​ హైదరాబాద్​ పంపించి.. పేషెంట్ల నుంచి రూ.1,500 వసూలు చేశారు. 
హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం దేవన్నపేటకు చెందిన చందర్​ పది రోజుల కిందట అనారోగ్య కారణాలతో ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్​అయ్యాడు. రెండు రోజుల క్రితం ఆసుపత్రి సిబ్బంది రెండు టెస్టులు రాశారు. ఆ వెంటనే ఎంజీఎంలోకి  ప్రైవేటు ల్యాబ్​ సిబ్బంది ఎంటరయ్యారు. ఎంజీఎంలో టెస్టులు చేస్తే రిపోర్టులు లేట్ వస్తాయని చెప్పి.. తమ ల్యాబ్​ లో చేసుకొస్తామని శాంపిల్స్​ తీసుకుని వెళ్లిపోయారు. 

ఎంక్వైరీ చేయిస్తం

ప్రైవేటు ల్యాబ్​ల దోపిడీ, అనవసరమైన టెస్టులు చేయిస్తున్న విషయంలో ఎంక్వైరీ చేయిస్తం. బాధ్యులపై కచ్చితంగా సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం. ప్రైవేటు ల్యాబ్​ సిబ్బంది ఆసుపత్రి లోపలికి ఎంటర్​ కాకుండా నిఘా పెడతాం. టెస్టుల విషయంలో డబ్బులు అడిగినా.. పరీక్షలు బయటకు రాసినా నేరుగా సూపరింటెండెంట్ ఆఫీస్​లో కంప్లైంట్​ చేయాలి. 
-  డా.వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్