ఆపరేషన్ చేసిన్రు..కడుపులో కత్తెర మరిచిన్రు

ఆపరేషన్ చేసిన్రు..కడుపులో కత్తెర మరిచిన్రు

వరంగల్, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్​కడుపులోనే కత్తెర మరచిపోయిన ఘటన బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం కొద్దిరోజులుగా అల్సర్​తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు. కొద్దిరోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండ్రోజుల కిందట మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఎక్స్​రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. డాక్టర్లు విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని, సర్జరీ డాక్టర్లను పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు.