
- ఏపీ తరహా వ్యవస్థ ఏర్పాటుకుసర్కార్ యోచన
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ వైద్య విధాన పరిషత్(వీవీపీ)ను రద్దు చేసి, దాని స్థానంలో సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు వీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ నేతృత్వంలోని కమిటీ మంగళశారం ఆంధ్రప్రదేశ్కు వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన వైద్య విధాన పరిషత్ను ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేసి, డైరెక్టరేట్ ఏర్పాటు చేశారు.
మన దగ్గర కూడా అదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డాక్టర్లు, సిబ్బంది ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముంగట, అప్పటి బీఆర్ఎస్ సర్కార్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో వీవీపీపై స్టడీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా బాధ్యతలు చేపట్టాక ఈ అంశంపై అధికారులతో రివ్యూ చేశారు.
లాభ, నష్టాలపై నివేదికకు ఆదేశం
ఏపీలో అమలు అవుతున్న హెల్త్ కేర్ సర్వీసెస్ డైరెక్టరేట్ విధానం వల్ల కలిగే లాభ, నష్టాలపై ఓ నివేదిక ఇవ్వాలని వీవీపీ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సీనియర్ డాక్టర్లతో కలిసి, కమిషనర్ ఏపీలో స్టడీ కోసం వెళ్లారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు ఉంటాయి. ఈ దవాఖాన్లలో స్పెషాలిటీ వైద్య సేవలు అందజేస్తారు.
ఈ మేరకు ఓ సొసైటీ కింద ఉమ్మడి రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ను ఏర్పాటు చేశారు. దీంతో వీవీపీ పరిధిలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్టుగా, ట్రెజరీ నుంచి శాలరీలు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్ఎస్ వంటి సౌకర్యాలు కూడా వీరికి లేవు. నిధుల కేటాయింపు, ఉద్యోగుల బదిలీలు వంటి అంశాల్లోనూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీవీపీని రద్దు చేసి, డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డాక్టర్లు కోరుతున్నారు.