
పోలింగ్ స్టేషన్ ఫుటేజీని బహిరంగపరచాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. పోలింగ్ స్టేషన్ వీడియో కంటెంట్ను షేర్ చేయడం వల్ల ఓటరు గోప్యతకు భంగం కలుగుతుందని చెప్పింది.
ఈ చర్యతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతుందని ఎన్నికల సంఘం (EC) శనివారం (జూన్ 21) స్పష్టం చేసింది. ఫుటేజీని విడుదల చేయాలనే డిమాండ్లు పారదర్శకతను ప్రోత్సహించేలా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి ప్రతికూలమైనవి ,చట్టవిరుద్ధం అని అంటున్నారు ఎన్నికల అధికారులు.
పోలింగ్ కేంద్రాల నుంచి ఫుటేజ్లను విడుదల చేయడం వల్ల ఓటర్ల గోప్యత ,భద్రత దెబ్బతింటుందని EC హెచ్చరించింది. 1950 ,1951 ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు సమర్థించిన విధంగా ఓటరు గోప్యత అత్యంత కీలకం. ఫుటేజ్లను పంచుకోవడం వల్ల ఎవరు ఓటు వేశారో లేదా ఓటు వేయకుండా ఉన్నారో గుర్తించడానికి వీలు అవుతుంది. దీనివల్ల స్వార్థ ప్రయోజనాలకోసం ఓటర్లు బలవంతం చేయడం, వివక్ష లేదా బెదిరింపులకు గురవుతారని కమిషన్ చెపుతోంది.
ఒక రాజకీయ పార్టీకి ఒక బూత్లో తక్కువ ఓట్లు వస్తే వారు సపోర్టర్లు లేదా మద్దతుదారులు కానివారిని గుర్తించేందుకు ఈ ఫుటేజీని సమీక్షించవచ్చు. ఇది ఎన్నికల తర్వాత వేధింపులకు దారితీయవచ్చు. ఇది ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసినట్లే అని ఈసీ చెబుతోంది.
అయితే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బలమైన ఆధారాలతో ఫిర్యాదులు వచ్చినప్పుడు కోర్టు ఆదేశాల మేరకు లేదా ఎన్నికల కమిషన్ అంతర్గత విచారణల కోసం ఈ ఫుటేజ్ను పరిశీలించే అవకాశం ఉంటుందని, సాధారణ ప్రజలకు లేదా రాజకీయ పార్టీలకు నేరుగా ఈ ఫుటేజ్ ఇవ్వడం మాత్రం కుదరదని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.