ఇంగ్లండ్‌‌‌‌దే బోణీ.. తొలి టెస్ట్‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి

ఇంగ్లండ్‌‌‌‌దే బోణీ.. తొలి టెస్ట్‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి

లీడ్స్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌లో మెరుపులు మెరిపించిన యంగ్‌‌‌‌ టీమిండియా.. బౌలింగ్‌‌‌‌లో అట్టర్‌‌‌‌ ఫ్లాప్‌‌‌‌ అయ్యింది. 371 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని కాపాడుకోలేక అప్పన్నంగా మ్యాచ్‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌కు అప్పగించేసింది. ఛేజింగ్‌‌‌‌లో బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ (170 బాల్స్‌‌‌‌లో 21 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 149) సూపర్‌‌‌‌ సెంచరీకి తోడు జాక్‌‌‌‌ క్రాలీ (65), జో రూట్‌‌‌‌ (53 నాటౌట్), జెమీ స్మిత్‌‌‌‌ (44 నాటౌట్‌‌‌‌) మెరుగ్గా ఆడటంతో.. మంగళవారం ముగిసిన తొలి టెస్ట్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది. 

ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌లసిరీస్‌‌‌‌లో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. 371 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో 20/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 82 ఓవర్లలో 373/5 స్కోరు చేసి నెగ్గింది. డకెట్‎కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్‌‌‌‌ జులై 2 నుంచి బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌లో జరుగుతుంది. 

బౌలర్లు ఫ్లాప్‌‌‌‌..

ఆఖరి రోజు పిచ్‌‌‌‌లో క్షీణత ఉంటుందని భావించినా.. బ్యాటర్లకే ఎక్కువగా అనుకూలించింది. దీనికి తోడు ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ జాక్‌‌‌‌ క్రాలీ, బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ అద్భుతమైన డిఫెన్స్‌‌‌‌తో టీమిండియా బౌలింగ్‌‌‌‌ను అడ్డుకున్నారు. బుమ్రా బౌలింగ్‌‌‌‌లో పెద్దగా రిస్క్‌‌‌‌ తీసుకోకుండా ఆడిన ఈ ఇద్దరు మిగతా బౌలర్లను మాత్రం ఓ ఆటాడుకున్నారు. తొలి సెషన్‌‌‌‌ మద్యలో బుమ్రా అద్భుతమైన ఆఫ్‌‌‌‌ వ్యాలీతో డకెట్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ను ఛేదించినా వికెట్‌‌‌‌ తీయలేకపోయాడు. ఇక అవతలి వైపు సిరాజ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (2/92), శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (2/51) లైన్‌‌‌‌ అండ్ లెంగ్త్‌‌‌‌ తప్పారు. 

దాంతో పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో క్రాలీ, డకెట్‌‌‌‌ స్వేచ్ఛగా కట్స్‌‌‌‌, ఫుల్‌‌‌‌, డ్రైవ్స్‌‌‌‌ ఆడారు. ప్రసిధ్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని డకెట్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ కవర్ డ్రైవ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. దీన్ని నివారించేందుకు బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ మోర్కెల్‌‌‌‌ బౌండ్రీ రోప్‌‌‌‌ వద్ద సలహాలు ఇచ్చినా సక్సెస్‌‌‌‌ కాలేదు. 42 రన్స్‌‌‌‌ వద్ద క్రాలీ ఇచ్చిన రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ను బుమ్రా వదిలేశాడు. పిచ్‌‌‌‌పై టర్నింగ్‌‌‌‌ లేకపోవడంతో జడేజా కూడా నిరాశపర్చాడు. తొలి సెషన్‌‌‌‌లో 96 రన్స్‌‌‌‌ జత చేసిన ఇంగ్లండ్‌‌‌‌ 117/0తో లంచ్‌‌‌‌కు వెళ్లింది. 

చకచకా వికెట్లు.. 

లంచ్‌‌‌‌ తర్వాత మ్యాచ్‌‌‌‌కు కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఇండియా బౌలర్లు చకచకా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. 43వ ఓవర్‌‌‌‌లో క్రాలీని ఔట్‌‌‌‌ చేసిన ప్రసిధ్‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌కు 118 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేశాడు. తన తర్వాతి ఓవర్‌‌‌‌లోనే ఒలీ పోప్‌‌‌‌ (8)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. దాంతో ఇంగ్లండ్‌‌‌‌ 206/2తో నిలిచింది. 14 బాల్స్‌‌‌‌ తేడాలో ఈ రెండు వికెట్లు పడినా డకెట్‌‌‌‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. 

మంచి ఫుట్‌‌‌‌ వర్క్‌‌‌‌తో ఈజీగా రన్స్‌‌‌‌ రాబట్టాడు. ఈ క్రమంలో సిరాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో ఇచ్చిన ఓ క్యాచ్‌‌‌‌ను జైస్వాల్‌‌‌‌ జారవిడిచి మూల్యం చెల్లించుకున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న డకెట్‌‌‌‌ 121 బాల్స్‌‌‌‌లో సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌‌‌లో రూట్‌‌‌‌ అండగా నిలిచాడు. ఈ ఇద్దరు సులువుగా రన్స్‌‌‌‌ చేస్తుండటంతో గిల్‌‌‌‌.. శార్దూల్‌‌‌‌ను బౌలింగ్‌‌‌‌కు దించాడు. ఈ స్ట్రాటజీ ఫలించింది.

 54వ ఓవర్‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌లో డకెట్‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు. స్కోరు 253/4గా మారింది. రూట్‌‌‌‌కు తోడైన స్టోక్స్‌‌‌‌ (33) ఎక్కువసేపు వికెట్‌‌‌‌ను కాపాడుకోలేదు. చకచకా బౌండ్రీలు బాది 68వ ఓవర్‌‌‌‌లో జడేజా బౌలింగ్‌‌‌‌లో వెనుదిరిగాడు. ఐదో వికెట్‌‌‌‌కు 49 రన్స్‌‌‌‌ జతయ్యాయి. 302/5 స్కోరు వద్ద వచ్చిన జెమీ స్మిత్‌‌‌‌ నిలకడగా ఆడాడు. లక్ష్యం చిన్నది కావడంతో  రూట్‌‌‌‌తో కలిసి ఈజీగా గెలిపించాడు. 

సంక్షిప్త స్కోర్లు:
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 471 ఆలౌట్‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 465 ఆలౌట్‌‌‌‌. ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 364 ఆలౌట్‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 82 ఓవర్లలో 373/5 (డకెట్‌‌‌‌ 149, క్రాలీ 65, శార్దూల్‌‌‌‌ 2/51).