న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఈ ఏడాదిజులైలో కొత్తగా 18.23 లక్షల మంది చేరారు. ఇది క్రితం సంవత్సరం జులైతో పోలిస్తే 24.48 శాతం పెరిగింది. తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం జులైలో చేరినవారిలో 10.58 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్వో సోషల్ సెక్యూరిటీ పరిధిలోకి వచ్చారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నది. కొత్తగా చేరిన 10.58 లక్షల మందిలో దాదాపు 57.69 శాతం మంది 18-–25 ఏళ్ల మధ్య వయస్కులే! దీనిని బట్టిచూస్తే సంఘటిత రంగ ఉద్యోగాల్లో ఎక్కువ యువతకు వెళ్తున్నాయని ఎనలిస్టులు అంటున్నారు. ఇదే నెలలో ఈపీఎఫ్ఓ నుంచి దాదాపు 4.07 లక్షల మంది వెళ్లిపోగా, 11.72 లక్షల మంది తిరిగి చేరారు.
వీళ్లు ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా తమ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. వేగంగా సేవలు అందించడానికి ఈపీఎఫ్ఓ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. జులైలో చేరిన మహిళల సంఖ్య 4.06 లక్షలు. పోయిన జులై తో పోలిస్తే ఇది 34.84 శాతం పెరిగింది. నెలలో ఈపీఎఫ్ఓలో చేరిన మొత్తం కొత్త సభ్యులలో మహిళా ఉద్యోగుల సంఖ్య 27.54 శాతంగా నమోదైంది. గత 12 నెలల్లో ఇదే అత్యధికం. ఈపీఎఫ్ఓలో మహిళా భాగస్వామ్యం పెరుగుతోందని కార్మికశాఖ తెలిపింది. నెలవారీగా లెక్కలను పరిశీలిస్తే తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ & మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ ఢిల్లీ రాష్ట్రాల నుంచి జులై నెలలో దాదాపు 12.46 లక్షల మంది ఈపీఎఫ్ఓలో చేరారు. జులై రిజిస్ట్రేషన్లలో..రెండు కేటగిరీలు అంటే 'ఎక్స్పర్ట్ సర్వీసెస్' (మాన్ పవర్ ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు మొదలైనవి) 'ట్రేడింగ్–కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల' వాటా 46.20 శాతం ఉంది. 'స్కూల్స్', 'బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ', 'ఫైనాన్సింగ్ ఎస్టాబ్లిష్మెంట్' మొదలైన పరిశ్రమల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు బాగున్నాయి.