లాక్​‌డౌన్‌ దెబ్బకు అన్నీ డబుల్ రేట్లు

లాక్​‌డౌన్‌ దెబ్బకు అన్నీ డబుల్ రేట్లు

వరంగల్, వెలుగు: కరోనా తో బతుకు భయమే కాదు, బతకడమూ బరువైతంది. లాక్​డౌన్​తో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి కొందరు, సగం సగం జీతాలతో ఇంకొందరు భారంగా కుటుంబాలను సాకుతాంటే పెరుగుతున్న రేట్లు వారిని ఆగం చేస్తున్నయి. కిరాణ సామాను నుంచి బట్టలు, వెహికిల్స్​ స్పెయిర్​పార్ట్స్, మెకానిక్​ చార్జీలు, ఆటోరేట్లు,  ఇస్త్రీ, హెయిర్​ కటింగ్​చార్జీలు .. ఇట్ల అన్నీపెరిగినయ్​. లాక్​డౌన్​ వల్ల ట్రాన్స్​పోర్ట్​ కష్టమై రేట్లు పెంచుతున్నామని  వ్యాపారులు చెబుతాంటే,  తాము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నందున పెంచక తప్పడం లేదని మెకానిక్​లు, ఆటోవాలాలు, బార్బర్స్​అంటున్నరు.

తిండి సామాన్లకు తిప్పలే..

మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్​డౌన్​ పెట్టాక కిరాణషాపులు, మాల్స్​లలో ఏ సామాను కొనాలన్నా సగటు వ్యక్తి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. పప్పు, ఉప్పు, చెక్కర, గోధుమ పిండి, ఇడ్లిరవ్వ, బియ్యం.. ఇట్ల అన్నింటి రేట్లు పెరిగినయ్​. పప్పుల ధరలు కిలోకు గతంలో కంటే రూ.20 నుంచి రూ.50 దాకా పెంచిన్రు. లాక్​డౌన్​ కంటే ముందు కిలోకు రూ.80 ఉన్న కందిపప్పును ఇప్పుడు 100 కుపైగా అమ్ముతున్నరు. కిలోకు రూ.90 ఉన్నపెసరపప్పును రూ.130కి అమ్ముతున్నరు. ఆయిల్​ప్యాకెట్ల మీద గతంల కంటే రూ.20 నుంచి రూ.30 దాకా ఎక్కువ తీసుకుంటున్నరు.  కూల్​డ్రింకుల మీద రూ.5 నుంచి రూ.10 దాక ఎక్కువేస్తున్నరు. పొద్దుగాల కొనే పాలప్యాకెట్​ మీదకూడ రూపాయో, రెండురూపాయలో ఎక్కువ గుంజుతున్నరు.

కటింగ్​ డబుల్​..

కటింగ్, షేవింగ్​ కలిపి టౌన్లు, సిటీల్లో గతంలో100 రూపాయలు తీసుకునేవాళ్లు. ఏసీ షాపుల్లో 150 దాక వసూలుచేసేది. గ్రామాల్లో 50 నుంచి 80 రూపాయల్లో కథ ఒడిసేది. కానీ ఇప్పుడు ఏ సెలూన్​కు వెళ్లినా రేట్లు డబుల్​ చేశారనే మాట వినిపిస్తాంది.  కటింగ్​, షేవింగ్ ​కలిపితే రూ.250 దాకా వసూలు చేస్తున్నరు. గతంలో కటింగ్ ​చేసేటప్పుడు ఒకే క్లాత్​ను అందరికీ కప్పేవాళ్లు. కానీ ఇప్పుడు యూస్​ అండ్ ​త్రో ​క్లాత్ వాడుతున్నరు. శానిటైజర్లు ఎక్కువగా యూజ్ ​చేస్తున్నరు. ​మరోవైపు ఇస్త్రీ రేట్లను కూడా ఒక్కోజతకు రూ.5నుంచి రూ.10 దాకా పెంచిన్రు.

బట్టలు, వెహికిల్స్​ స్పేర్​పార్ట్స్​..

పుట్టిన రోజుకో.. పెళ్లి రోజుకో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రెస్​ కొందామని వెళ్లేవారికి కొన్ని బట్టలషాపుల్లో చుక్కలు కనిపిస్తున్నయి. గతంలో ఉన్నరేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నరని కస్టమర్లు అంటున్నరు. ఇక బైకులు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వెహికిల్స్​ స్పేర్​పార్ట్స్​ రేట్లను పెంచి అమ్ముతున్నరు.   వ్యవసాయ సీజన్​ కావడంతో  ట్రాక్టర్లు, దుక్కి దున్నే యంత్రాల​ స్పేర్​ పార్ట్స్​ దొరకట్లేదు. దీంతో బ్లాక్​లో తెప్పించుకోవాల్సి వస్తోందని అంటున్నరు. భవన నిర్మాణ, కార్పెంటర్​ తదితర రంగాలకు చెందిన మెటీరియల్​ కూడా ఎక్కువరేట్లకు అమ్ముతున్నరనీ, మెకానిక్​లు కూడా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నరని జనం చెబుతున్నరు.

For More News..

ఫస్ట్ డే.. బిజినెస్ డల్

కొడుకు ప్రేమిస్తే.. తండ్రిని చంపేశారు

ఓపెన్ అయినా జనం పెద్దగా రాలే!