ఒకప్పుడు మొబైల్ ఫోన్లను భారీగా దిగుమతి చేసుకునే స్టేజ్ నుంచి ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్జేజ్కు ఎదిగాం. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య జరిగిన మొబైల్ ఫోన్ల ఎక్స్పోర్ట్స్ డేటాను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఈ టైమ్ పిరియడ్లో దేశ మొబైల్ ఫోన్ ఎగుమతులు 1.7 బిలియన్ డాలర్ల (రూ.12,920 కోట్ల) కు చేరుకున్నాయి. 2017–18 లో మొబైల్ ఫోన్ల ఎగుమతులు కేవలం 0.2 బిలియన్ డాలర్లు (రూ.1,520 కోట్లు) మాత్రమే. అదే విధంగా దిగుమతి చేసుకుంటున్న ఫోన్లు కూడా బాగా తగ్గాయి. దిగుమతులు 2017–19లో 3.5 బిలియన్ డాలర్లు (రూ.26,600 కోట్లు) గా ఉండేవి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 0.5 బిలియన్ డాలర్ల (రూ.3,800 కోట్ల) కు తగ్గాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఈ డేటాను బయటపెట్టారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ల తయారీని పెంచేందుకు ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్ను ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్కు కూడా విస్తరించింది. పీఎల్ఐ స్కీమ్ వలన దేశంలో ఫోన్ల మాన్యుఫాక్చరింగ్ బాగా పెరిగిందని అనుప్రియా పేర్కొన్నారు. ఐటీ హార్డ్వేర్ సెక్టార్కు పీఎల్ఐని విస్తరించడం, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్స్ (ఎస్పీఈసీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ కింద ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ (ఈఎంసీ–2.0) ను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో మొబైల్ ఫోన్ల తయారీ పెరుగుతోందని చెప్పారు. భవిష్యత్లో మొబైల్ ఫోన్లతో సహా మిగిలిన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు పెరుగుతాయని అంచనావేశారు. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ను పెంచేందుకు 100 శాతం వరకు ఆటోమెటిక్ రూట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్డీఐలకు అవకాశం ఇచ్చామని అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీ, వాటి విడిబాగాల తయారీని పెంచేందుకు ఫేజ్డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ) ను కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒమిక్రాన్ ప్రభావం ఉండకపోవచ్చు..
మొబైల్ ఫోన్ల డొమెస్టిక్ సేల్స్పై కరోనా ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ‘సాధారణంగా దీపావళి తర్వాత ఫోన్ల సేల్స్ తక్కువగా ఉంటాయి. జనవరి చివరి వరకు ఇలానే ఉంటుంది. చైనీస్ న్యూ ఇయర్ తర్వాత సేల్స్ మళ్లీ పుంజుకుంటాయి. దీపావళి నుంచి జనవరి చివరి వరకు మొబైల్ ఫోన్ మార్కెట్లో యాక్టివిటీ తక్కువగానే ఉంటుంది’ అని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూస అన్నారు. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో సప్లయ్ చెయిన్పై ఒమిక్రాన్ ప్రభావం ఉండకపోవచ్చని, కానీ, ఈ విషయంపై ఇప్పుడే కన్ఫార్మ్గా చెప్పలేమని అన్నారు. న్యూ ఇయర్ లేదా క్రిస్మస్ టైమ్లో ఫోన్ల డిమాండ్ను చేరుకోవడానికి కంపెనీల దగ్గర సరిపడ ఇన్వెంటరీ ఉందని ఫైజల్ పేర్కొన్నారు. ఎగుమతులపై మాత్రం కరోనా ఒమిక్రాన్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దేశ మొబైల్ ఎగుమతుల్లో 12 శాతం వాటా ఆఫ్రికన్ కంట్రీస్కు వెళుతున్నాయని, ఒమిక్రాన్కు ప్రస్తుతం ఈ దేశాలు హాట్స్పాట్గా ఉన్నాయని గుర్తు చేశారు. లావా, షావోమి, ఒప్పో, శామ్సంగ్, ట్రాన్సన్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. వీటిపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.