ఒక్క కార్బన్ డయాక్సైడ్ వల్లే భూమి వేడెక్కుతుందనడం కరెక్ట్ కాదని ఆధునిక పర్యావరణ పితామహుడిగా పిలిచే ప్రముఖ పర్యావరణవేత్త హ్యూబర్ట్ ల్యాంబ్ అప్పుడెప్పుడో చెప్పారు. ఆ ఎమిషన్స్ వల్ల వచ్చే వేడి దానికి అసలు కారణమన్నారు. అదే కాకుండా అణు పరీక్షలు, అగ్నిపర్వత పేలుళ్లూ వేడిని బయటకు వదలడం వల్ల భూమి మండుతుందని అప్పట్లోనే వివరించారు. 2009లో ఇద్దరు స్వీడన్ సైంటిస్టులూ ఆయన మాటలకే మద్దతు తెలిపారు. రెండేళ్ల తర్వాత మరో ఇద్దరు చైనా సైంటిస్టులూ విపరీతమైన వేడి, వాతావరణ మార్పులకు కారణమవుతుందని వివరించారు. అది కూడా భూమి లోపల నుంచే విడుదలవుతుందని చెప్పారు. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి భూమి లోపల కొన్ని పొరల్లో పరుచుకుని ఉన్నాయని, అవన్నీ కూడా వేడిని పట్టి ఉంచుతాయని వివరించారు. అయితే, ఆ వనరులన్నింటినీ తోడి తీసేయడం వల్ల వాతావరణంలోకి అందులో ట్రాప్ అయిన వేడి కూడా విడుదలవుతోందని, ఫలితంగా భూమి వేడెక్కుతోందని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే సైంటిస్టులు చమురు, బొగ్గు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత వల్ల టెంపరేచర్లు ఎట్లా ప్రభావితమయ్యాయో పరిశోధన చేశారు. వాటిని తీసిన ప్రాంతాల్లో వేడి బాగా పెరిగిందని గుర్తించారు.
ఆర్కిటిక్లో ఎక్కువ.. అంటార్కిటికాలో తక్కువ
2007 నుంచి 2017 మధ్య 4,550 కోట్ల టన్నుల ఆయిల్, 3,630 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ను భూమి లోపలి నుంచి ప్రపంచ దేశాలు వెలికితీశాయి. ఆ వెలికితీతలో మిగులు వ్యర్థాలన్నీ సముద్రం, భూమిపై పరుచుకుపోయాయి. దీంతో భూమిలోపల ఉన్న వేడంతా నేల, నీళ్ల మీదకు వచ్చేసింది. సముద్రాలు, భూమి వేడెక్కాయి. ప్రపంచం సగటు భూమి వేడితో పోలిస్తే చమురును వెలికితీసే సౌదీ అరేబియా, అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, నార్త్ సీ, అలస్కా వంటి ప్రాంతాల్లో 3 నుంచి 6 రెట్లు ఎక్కువగా వేడి నమోదైనట్టు తేల్చారు. ఎక్కువగా ఆర్కిటిక్ ప్రాంతంలోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్టు గుర్తించారు. 1978 నుంచి ప్రతి పదేళ్లకోసారి 0.6 డిగ్రీల టెంపరేచర్ పెరిగినట్టు తేల్చారు. అంటార్కిటికాలో మాత్రం 0.1 డిగ్రీలు ఎక్కువైనట్టు గుర్తించారు. ఆ రెండు ధ్రువాల వద్ద కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు తక్కువగానే ఉన్నా, ఆర్కిటిక్లో ఇంధన వనరులను తోడడం వల్లే టెంపరేచర్లు పెరిగినట్టు చెప్పారు. అంటార్కిటికాలో లేదు కాబట్టే వేడి అంతగా పెరగలేదన్నారు. 2007 నుంచి ఆర్కిటిక్లోని 400కు పైగా ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్నారు. అంటార్కిటికాలో మాత్రం నిషేధం విధించారు.
భూమిలోని హీట్ షీల్డ్ పోవడం వల్లే
ఈ పరిస్థితులకు కారణం సహజ వనరులను తోడడం వల్ల భూమి లోపల ఉండే హీట్ షీల్డ్లు పోవడమేనని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ హీట్ షీల్డ్లను కాపాడుకుంటే భూమి లోపల ఉన్న వేడి భూమిపైకి రాదని చెబుతున్నారు. అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని ఓజోన్ పొర కాపాడినట్టే, భూమి లోపల కూడా వేడి బయటకు రాకుండా ఆ హీట్షీల్డ్లే కాపాడతాయని అంటున్నారు. కాబట్టి వాటిని పటిష్టం చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటున్నారు.
ఇంగ్లాండ్ పరిస్థితీ అదే
ఈశాన్య ఇంగ్లాండ్లో బొగ్గు తవ్వకాలు ఎక్కువ. దాని వల్ల అక్కడ భూ ఉపరితలం రూపు రేఖలే మారిపోయాయి. ముఖ్యంగా గేట్స్హెడ్, న్యూకాజిల్లోని బొగ్గు గనుల వద్ద భూమి లోపలి నుంచి వేడి బయటకు పొక్కింది. దాంతో వాటి చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఆ రెండు ప్రాంతాల్లో 2 డిగ్రీల వేడి ఎక్కువగా నమోదైంది. గేట్స్హెడ్ వద్దైతే అది 4.5 డిగ్రీలు. అంతేకాదు, ఆ బొగ్గు గనిలోని వాటర్ పంపింగ్ స్టేషన్ వద్ద నీళ్లు కూడా బాగా వేడెక్కినట్టు తేలింది. వాటి మీద రీసెర్చ్ చేశారు కాబట్టి ఈ విషయం తేలింది. అదే ప్రభావం మిగతా గనులపైనా ఉంటుందన్నది సైంటిస్టులు చెబుతున్న మాట.