అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ హవా .. 5 బైపోల్స్లో 2 స్థానాల్లో ఆప్ విజయం

  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ హవా .. 5 బైపోల్స్లో 2 స్థానాల్లో  ఆప్ విజయం
  • కేరళలోని నీలంబర్​లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్​ గెలుపు

న్యూఢిల్లీ: ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్)  సత్తాచాటింది. గుజరాత్, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఈ నెల 19న 5 నియోజకవర్గాలకు బై పోల్స్​జరగగా.. సోమవారం ఓట్లు లెక్కించారు. మొత్తం 5 స్థానాల్లో రెండింట్లో ఆప్ ​విజయకేతనం ఎగురవేసింది.

 గుజరాత్​లోని జునాగఢ్ జిల్లా విశావదర్ స్థానంలో ఆప్ గుజరాత్ మాజీ అధ్యక్షుడు ఇటాలియా.. బీజేపీ అభ్యర్థి కిరిత్ పటేల్‌‌‌‌‌‌‌‌ను 17,554 ఓట్ల తేడాతో ఓడించారు. అలాగే, పంజాబ్​లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ స్థానంలో ఆప్​ అభ్యర్థి సంజీవ్ అరోరా.. కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ అషును 10,637 ఓట్ల తేడాతో ఓడించారు. అదేవిధంగా, గుజరాత్​లోని మెహ్సానా జిల్లా కాడి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  అభ్యర్థి రమేశ్ చావ్డాపై 39,452 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

కేరళలోని నీలంబర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్ అభ్యర్థి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. స్వరాజ్‌‌‌‌‌‌‌‌ పై, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ లో నదియా జిల్లా కాలిగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అలీఫా అహ్మద్ 50,049 ఓట్ల భారీ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఆశిష్ ఘోష్‌‌‌‌‌‌‌‌పై గెలిచారు. 

రాజ్యసభకు వెళ్లడం లేదు: ఆప్​ చీఫ్​

ఆప్ జాతీయ కన్వీనర్  కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజ్యసభకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. పంజాబ్​లోని లుథియానా వెస్ట్​ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోడా విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే.. ఆ స్థానం నుంచి కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాను రాజ్యసభకు వెళ్లడంలేదని కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. 

ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు నుంచి ఎవరు పోటీ చేయాలనేది ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అలాగే,  విశావదర్, లూథియానా వెస్ట్ స్థానాల్లో ఆప్​అభ్యర్థులు విజయం సాధించడం పట్ల కేజ్రీవాల్​స్పందించారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో బీజేపీతో ప్రజలు విసుగు చెందారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ తిరస్కరించారని అన్నారు.