11న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన భారత్  

11న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన భారత్  

బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 (96) కన్నుమూసిన నేపథ్యంలో సెప్టెంబరు 11వ తేదీని (ఆదివారం) జాతీయ సంతాప దినంగా భారత్ ప్రకటించింది.  సంతాప సూచకంగా ఆ రోజున భారత జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. ఇక రాణి ఎలిజబెత్ మృతిపట్ల పీఎం మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ ను అభివర్ణించారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని మోడీ కొనియాడారు. 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎలిజబెత్ – 2 గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఇవాళ ఉదయమే రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకు వచ్చారు. రాణి మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ – 2 గుర్తింపు పొందారు.