
హైదరాబాద్, వెలుగు: కరోనాతో ఓ పెద్దావిడ చనిపోయింది. ఫ్యామిలీనేమో హోమ్ ఐసోలేషన్లో ఉంది. దీంతో ఆ పెద్దావిడ కొడుకు ఫ్రెండ్స్ అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. హైటెక్ సిటీలోని హాస్పిటల్ నుంచి ఎర్రగడ్డ శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి హాస్పిటల్ అంబులెన్స్ అడిగారు. వాళ్లు రూ. 25 వేలు ఇస్తే గానీ తరలించడానికి ఒప్పుకోలేదు. అక్కడికి పోయాక కూడా ఇబ్బంది తప్పలేదు. శ్మశాన వాటికలోకి అనుమతించలేదు. అక్కడా ఇంకో రూ. 10 వేలు ఇవ్వాల్సి వచ్చింది. తామైతే డబ్బులిచ్చాం గానీ పైసలు లేనోళ్లు కరోనాతో చనిపోతే పరిస్థితి ఏంటి అని వాళ్లు ఆలోచించారు. ఎలాగైనా సరే అలాంటోళ్లకు సాయం చేద్దామనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘సర్వ్ ద నీడీ అంబులెన్స్ సర్వీస్’.
కుటుంబీకులు కోరిన చోట..
పది మంది ఫ్రెండ్స్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్లు) కలిసి ‘సర్వ్ ద నీడీ’ ఫ్రీ అంబులెన్స్ సర్వీసును స్టార్ట్ చేశారు. మారుతీ వ్యాన్ను సెకండ్ హ్యాండ్లో రూ. 65 వేలకు కొన్నారు. ఇంకో రూ. 15 వేలు ఖర్చుపెట్టి ఆ వ్యాన్ను అంబులెన్స్గా మార్చారు. వీళ్లకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఎన్జీవో రూ. 50 వేలు సాయం చేసింది. అంబులెన్స్లో ఓ డ్రైవర్, హెల్పింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేసుకున్నారు. వాళ్లకు పీపీపీ కిట్స్ అందిస్తున్నారు. హెల్త్ ఇన్యూరెన్స్ కూడా చేయించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం క్రితం ప్రారంభమైందీ సర్వీస్. చనిపోయిన కొవిడ్ పేషెంట్లను హాస్పిటల్ నుంచి శ్మశానికి డెడ్బాడీని తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఎర్రగడ్డ శ్మశాన వాటికలో దహనం చేస్తున్నట్లు సర్వ్ ద నీడీ మెంబర్ సాయితేజ తెలిపారు. కుటుంబీకులు కోరిన చోట కూడా జరిపిస్తున్నామన్నారు. ఇదంతా ఫ్రీ సర్వీస్ అని.. డబ్బులున్న వాళ్లు రూ. 2,500, అది కూడా అంత్యక్రియలకు ఇవ్వొచ్చని చెప్పారు. పొద్దున రూ. 8 గంటల నుంచి సాయంత్రం రూ. 6 గంటల వరకు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు.