నా రాజీనామాకు కారణం రాహుల్ గాంధీనే

నా రాజీనామాకు కారణం రాహుల్ గాంధీనే

కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి  నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపించారు. తన రిజైన్కు గల కారణాలను లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మార్పులను సూచించేందుకు గతంలో నిర్వహించిన మేధోమథనంలోని అంశాలు అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆగస్టు 16న జమ్ము కాశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధిపతి పదవికి ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. 

రాహుల్ పై గులాం నబీ ఆజాద్ అసహనం

కాంగ్రెస్ తో అర్ధశతాబ్ద కాలంగా సంబంధాలున్నాయని గులాంనబీ ఆజాద్ అన్నారు . కాంగ్రెస్ తో సంబంధం తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన సీనియర్ నేతలను పక్కన పెట్టడంపై తీవ్ర మనస్థాపం చెందానని తెలిపారు. రాహుల్ గాంధీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ రాజకీయ పలుకుబడి క్షీణించడం.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో పేలవమైన పనితీరుకు రాహుల్ గాంధీ అపరిపక్వతే కారణమని ఆరోపించారు.

సీనియర్లను రాహుల్‌ పక్కన పెట్టేశారు

ప్రభుత్వ ఆర్డినెన్స్ ను మీడియా ముఖంగా అందరూ చూస్తుండగానే చించివేయడం రాహుల్ అపరిపత్వతకు నిదర్శనమన్నారు. రాహుల్‌ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్‌ పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్‌ జోక్యం పెరిగిందన్నారు. అనుభవం లేని కొత్త కోటరీ పార్టీ వ్యవహారాలను నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు  రాహుల్‌ను నిందిస్తూనే సోనియాగాంధీని ప్రశంసించారు. దురదృష్టవశాత్తూ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. ముఖ్యంగా జనవరి 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత మొత్తం యంత్రాంగాన్ని ఆయన కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో సోనియా పాత్ర నామమాత్రమే..

ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా విషయాల్లో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని ఆజాద్ అన్నారు. కీలక నిర్ణయాలు రాహుల్‌ గాంధీ లేదా ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకొంటున్నారని తప్పుపట్టారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రెండు లోక్‌సభ ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓడిపోయిందన్నారు. పార్టీ కేవలం నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించిందన్నారు. నేడు కాంగ్రెస్ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని..మరో రెండు రాష్ట్రాల్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతుందని ఆజాద్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ సంస్థాగత సమగ్రతను కూల్చివేసిన రిమోట్ కంట్రోల్ మోడల్ ఇప్పటికీ కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. 

జీ-23 నేతల్లో ఆజాద్ ఒకరు...
ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో అందుకుగల కారణాలపై  అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోన్న జీ 23 నేతల్లో గులాంనబీ ఆజాద్‌ ఒకరు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి అనంతరం పార్టీ సంస్థాగత మార్పుపై ఆజాద్‌ తీవ్రంగా గళమెత్తారు.