సోనాలీ మరణంపై కొనసాగుతున్న మిస్టరీ

సోనాలీ మరణంపై కొనసాగుతున్న మిస్టరీ

టిక్‌టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్‌(42) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్‌ సావంత్‌ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తనతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మాట్లాడినట్లు వెల్లడించారు. సోనాలీ ఫోగాట్‌ మృతిపై లోతైన విచారణ జరిపించాలని తనను కోరినట్లు తెలిపారు. ఫోగాట్‌ కుటుంబం సీబీఐ దర్యాప్తును డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని కూడా తనతో ప్రస్తావించారని వివరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గోవా ముఖ్యమంత్రి అరవింద్‌ సావంత్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే గోవా పోలీసులు ఈ కేసును అన్ని కోనాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్‌ గత సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. మొదట సోనాలీ ఫోగాట్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ ఫోగాట్ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, అతడి స్నేహితుడు సుఖ్వీందర్‌ సహా ఇప్పటి వరకు మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు. సోనాలీ భర్త కొన్నేళ్ల కిందట మృతిచెందారు.