ట్రీట్ మెంట్ రేట్లు ముందే చెప్పండి

ట్రీట్ మెంట్ రేట్లు ముందే చెప్పండి

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ ధరలు సామాన్యులకూ అందుబాటులో ఉండాలని, ఏ ఒక్కరికీ ట్రీట్మెంట్ను నిరాకరించొద్దని ప్రైవేట్ హాస్పిటళ్లకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సమకూర్చుకుని ఎకానమీ ప్యాకేజీలో జనాలకు ట్రీట్మెంట్ చేయాలన్నారు. ట్రీట్మెంట్ రేట్లను ముందే చెప్పాలని సూచించారు. మధ్యతరగతి వారికైనా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలన్నదే తన తపన అని ఆమె అన్నారు. మంగళవారం కార్పొరైట్, ప్రైవేట్ హాస్పిటళ్లతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కరోనా ట్రీట్మెంట్పై సమీక్ష చేశారు. కరోనా ట్రీట్మెంట్ బిల్లుల్లో పారదర్శకత ఉండాలని సూచించారు.

ప్లాస్మా థెరపీ చేయండి

హాస్పిటళ్లు ప్లాస్మా బ్యాంక్ను ఏర్పాటు చేసుకుని, ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తీసుకురావాలని గవర్నర్ తమిళిసై సూచించారు. కేసులు మరిన్ని పెరిగితే ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో ట్రీట్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 80 శాతం మంది బాధితులకు లక్షణాలు తక్కువగా ఉంటున్నాయని, వాళ్లందరికీ హోమ్ఐసోలేషన్లో వీడియో కన్సల్టింగ్, కౌన్సిలింగ్, టెలీ మెడిసిన్ పద్ధతుల్లో ట్రీట్మెంట్ అందించాలన్నారు. ఇంట్లో ఉన్నా మంచి ట్రీట్మెంట్ అందుతోందని బాధితులు నమ్మితే ఆస్పత్రులకు జనం రారని చెప్పారు. ఫార్మా, మెడికల్, ఐటీకి హబ్గా హైదరాబాద్కు గుర్తింపు ఉండడంతో టెక్నాలజీ ద్వారా రోగులకు ట్రీట్మెంట్ అందించే ఏర్పాట్లు చేయాలని ఆస్పత్రులకు సూచించారు. అయితే, కొందరు పేషెంట్లు రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ వంటి ఖరీదైన మందులను అడుగుతున్నారని, ఎక్కువ మందికి వేరే జబ్బులూ ఉంటున్నాయని, వాటన్నింటి వల్లే ట్రీట్మెంట్ ఖర్చులు పెరుగుతున్నాయని ఆస్పత్రులు గవర్నర్కు వివరించాయి. రెమ్డెసివిర్ వంటి మందులకు కొరత ఉందని, వాటి తయారీని పెంచి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని, వెంటిలేటర్ల తయారీని పెంచాలని, వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరాయి. ఆ సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను తప్పనిసరిగా పెట్టుకుంటూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.

యాజమాన్యాలు రాలే.. వచ్చింది ప్రతినిధులే

సమీక్షకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రాలేదని తెలుస్తోంది. అందరూ ప్రతినిధులనే పంపించారని సమాచారం. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కిమ్స్ సీఎండీ భాస్కరరావు కూడా పాల్గొనలేదు.

మానవతా దృక్పథంతో పనిచేయండి

కరోనా పేషెంట్ ఆస్పత్రిలో చేరేటప్పుడే ముందే ట్రీట్మెంట్ వివరాలు, ఖర్చులు వివరించాలని ఆస్పత్రులకు గవర్నర్ తమిళిసై సూచించారు. బెడ్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలిపేందుకు ‘బెడ్స్పూల్’ విధానాన్ని అమలు చేయాలన్నారు. ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే బాధను తప్పించాలన్నారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో ప్రైవేట్ హాస్పిటళ్లు ప్రత్యేక బాధ్యత, మానవతా దృక్పథంతో పనిచేయాలని అన్నారు. కరోనా టెస్టుల రిజల్ట్స్ లేట్ అవుతుండడంతో పేషెంట్లు ఆందోళన చెందుతన్నారని, అవసరమైన వారికి ట్రీట్మెంట్ ఇవ్వడమూ ఆలస్యమవుతోందని, టెస్టులు చేస్తున్న ల్యాబ్లు ఫలితాలు తొందరగా ఇచ్చేలా పనిచేయాలని గవర్నర్ సూచించారు. హెల్త్కార్డులు, ఇన్సూరెన్సులు ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ టైంకు అందేలా ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం