ప్రస్తుత పరిస్థితుల్లో అర్థరహితంగా సీడబ్ల్యూసీ 

ప్రస్తుత పరిస్థితుల్లో అర్థరహితంగా సీడబ్ల్యూసీ 

కాంగ్రెస్ పార్టీపై గులాంనబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం గురించి తాను చాలా సార్లు ప్రతిపాదనలు చేసినా.. వాటిని రాహుల్ గాంధీ ఏనాడు పట్టించుకోలేదన్నారు. పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడాలని చాలాసార్లు రాహుల్ కి చెప్పినా ఆయన పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. తాను "త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పారు.  గత 25 ఏళ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నికల కమిటీలు లేవని, ఈ విషయంలో సోనియా గాంధీకి లేఖ కూడా రాశానని చెప్పారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గులాంనబీ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ కార్యక్రమాలు, బలోపేతంతో పాటు ఇతర ముఖ్యమైన విషయాలపై సోనియా గాంధీ.. గతంలో సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకునే వారని  గులాంనబీ ఆజాద్ చెప్పారు. 1998 నుంచి 2004 వరకూ సోనియా గాంధీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపేవారని, వారి సిఫార్సులను ఆమోదించేవారని వెల్లడించారు. గతంలో తనకు 8 రాష్ట్రాల ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పుడు 7 రాష్ర్టాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పారు. ఏనాడు కూడా తనకు అప్పగించిన రాష్ర్టాల్లో సోనియా జోక్యం చేసుకోలేదని, కానీ, రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి అతనిపై సోనియా గాంధీ ఆధారపడుతున్నారని అన్నారు. అయితే... పార్టీని  బలోపేతం చేయాలనే ఆలోచన, సంక్పలం రాహుల్ కు లేదన్నారు.

ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశం సోనియాగాంధీలో కనిపిస్తుందని గులాంనబీ ఆజాద్ అన్నారు.2013 జనవరి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక, అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారని, అయినా పార్టీలో ఏ మాత్రం మార్పు లేదన్నారు. గత వారం కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్‌.. ఈ రోజు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ "అర్ధరహితంగా" ఉందని అన్నారు. 2014 జాతీయ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి రాహుల్ కారణమని ఆరోపించారు. 

మొదటి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్, -సోనియాపై ఉన్న గౌరవం రాహుల్ పై కూడా తనకు అంతే ఉందని గులాంనబీ ఆజాద్ అన్నారు. రాహుల్ ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించినా... ఆయన పార్టీ పట్ల, తమ సలహాలను, సూచనలు పట్టించుకోలేదన్నారు.