50 లక్షల మాస్క్ల పంపిణీ
నిర్మాణ పనులపై సర్కారు బ్యాన్
ఈ నెల 5 వరకూ స్కూళ్లు బంద్
అవసరమైతే స్కూళ్ల సెలవులు పొడిగిస్తామన్న ప్రభుత్వం
ఉపిరితిత్తుల పేషంట్లతో హాస్పిటల్స్ కిటకిట
గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. నిర్మాణ పనులపై ఈ నెల 5 వరకు బ్యాన్ విధించారు. ఈ వింటర్ సీజన్లో బాణాసంచా కాల్చొద్దన్నారు. సుప్రీంకోర్టు ప్యానల్ శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. గురువారం రాత్రి పొల్యూషన్ లెవెల్స్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయని ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్అండ్ కంట్రోల్(ఈపీసీఏ) చైర్పర్సన్ భూరె లాల్ చెప్పారు. ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్న పిల్లలపై మరీ ఎక్కువని హెచ్చరించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సర్కారు స్కూళ్లకు ఈ నెల 5 వరకు సెలవులు ప్రకటించింది. కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం కేజ్రీవాల్ 50 లక్షల పొల్యూషన్ మాస్కులు ఉచితంగా పంచారు.
గ్యాస్చాంబర్లా మారింది..
ఢిల్లీలో కాలుష్యానికి చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాలే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పంటపొలాల్లో రైతులు వ్యర్థాలను తగలబెడుతున్నారని, వెహికిల్ పొల్యూషన్కు ఇది కూడా తోడవడంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్లా మారిందన్నారు. పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టాలంటూ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రైతులపై ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. దీనిని ఆపేయాలంటూ పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు లెటర్ రాయాలని స్కూల్ స్టూడెంట్లకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. విషతుల్యమైన గాలి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని, పొల్యూషన్ మాస్కులు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.
నార్తర్న్ రీజియన్లో వాయు పీడన పరిస్థితులు ఏర్పడడంతో గాలి వేగం పెరుగుతోందని, శనివారం నాటికి కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్ల వార్నింగ్తో పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ క్వాలిటీ మెరుగుపడేదాకా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని ట్విట్టర్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
అవసరాన్ని బట్టి స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇప్పటికే ప్రకటించారు.. మంగళవారం నాటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెలవులు పొడిగిస్తామని చెప్పారు.
తొమ్మిది కంపెనీలకు ఫైన్
గ్రేటర్ నోయిడాలో నిర్మాణ పనులతో వాయుకాలుష్యానికి కారణమైన తొమ్మిది సంస్థలకు యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రూ.5.25 లక్షల జరిమానా విధించింది. ఇందులో ప్రభుత్వ సంస్థ డీఎఫ్ సీసీఐఎల్, ఎల్అండ్ టీ కి ఉమ్మడిగా రూ.50 వేలు ఫైన్ వేసింది.
ఎయిర్ క్వాలిటీ ఎట్లుంది?
శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 425 పాయింట్లుగా నమోదైందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్) వెల్లడించింది. ఢిల్లీ మొత్తానికి బావానా ప్రాంతమే అత్యంత కాలుష్యకారకమని, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ 716 పాయింట్లుగా రికార్డైందని అధికారులు చెప్పారు.