హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర న్యాయ వ్యవస్థలోని ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కు అనుగుణంగా సౌకర్యాల్లేవని, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు జడ్జి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం డైమండ్ జూబ్లీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని దస్పల్ల హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. 75శాతం కేసుల్లో ప్రాసిక్యూషన్ విభాగం సహకారం ఉంటుందని, ఇలాంటి డిపార్ట్మెంట్ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. డైరెక్టరేట్కు సొంత ఆఫీసులు లేవన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
బాధ్యతాయుతంగా పని చేయాలి
త్యాగాలకు విలువల్లేని రోజుల్లో మనం ఉన్నామని, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ బాధ్యతాయుతంగా పనిచేయాలని జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ అందరి కోసం ఫైట్ చేయాలన్నారు. ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు యూనిటీగా పనిచేయాలన్నారు. కేసుల దర్యాప్తు, విచారణలో పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చేస్తున్నామని తెలిపారు. నిజమైన దోషులకు శిక్షలు పడ్డప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లోగో, సర్టిఫికెట్స్ అందించారు.