
బెంగుళూర్: ఐటీ రాజధాని బెంగుళూర్లో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో తవ్వకాలు చేస్తుంటే పదుల సంఖ్యలో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో అపార్ట్మెంట్వాసుల గుండెలు గుభేలుమున్నాయి. ఇన్నాళ్లు మనం పుర్రెలు, ఎముకలపై ఉంటున్నామా అని భయాందోళనకు గురయ్యారు. అసలీ ప్రదేశంలో ఇంతకుముందు ఏం ఉంది..? ఈ పుర్రెలు, ఎముకలు ఎక్కడివి..? అన్న విషయాలను శోధిస్తున్నారు.
వివరాల ప్రకారం.. 2025, జూన్ 16న ఆగ్నేయ బెంగళూరులోని బేగూర్ ఇండస్ట్రియల్ లేఅవుట్లోని ఓ అపార్ట్మెంట్లో డ్రైనేజీ పనుల కోసం సెల్లార్లో కార్మికులు తవ్వకాలు చేపట్టారు. కొంత లోతుకు తవ్వగానే ఊహించని విధంగా పుర్రె శకలాలు, అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాడు. ఒక్కసారిగా షాక్కు గురైన కార్మికులు భయంతో వెంటనే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడికి సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఈ విషయం చెప్పాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానిత పుర్రెలు, అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకుని విశ్లేషణ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించారు. ఫోరెన్సిక్ విశ్లేషణలో ఈ అవశేషాలు మనిషివా లేక జంతువువా అనే విషయంపై క్లారిటీ వస్తుందని తెలిపారు. వారం లోగా ఫోరెన్సిక్ రిపోర్టు వస్తోందని పోలీసులు చెప్పారు. ఆ నోట ఈ నోట విషయం అపార్ట్మెంట్వాసులకు తెలిసింది. అపార్ట్మెంట్ సెల్లార్లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయని తెలియడంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అయితే.. ఇదే ప్రాంతంలో ఎప్పటినుంచో నివాసముంటున్న స్థానికులు.. పుర్రెలు, ఎముకలు బయటపడ్డ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ భూమిలో గతంలో స్మశాన వాటిక ఉండేదని.. అందుకే సెల్లార్ తవ్వకాల్లో అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి అవశేషాలు బయటపడే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే ఆ అవశేషాలు మనిషివా లేక జంతువువా అనే మిస్టరీ వీడుతుందని చెప్పారు.