- భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు
- బాధితుల్లో తాగుబోతులు, నిరక్ష్యరాసులు..
- దేశంలో భర్తలపై ఐదింతలు పెరిగిన వయలెన్స్
- బయోసోషల్ సైన్స్ రీసెర్చ్ వెల్లడి
- తాగుడుకు బానిసై ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతోనే కొడుతున్నామన్న భార్యలు
- మగవాళ్లకు రక్షణ కల్పించే చట్టాలు తేవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: దేశంలో భర్తలపై దాడులు పెరుగుతున్నాయి. భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వివిధ కారణాలతో మహిళలు తమ భర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది.
ఇండియాలో హస్బండ్స్పై జరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్పై ఈ సంస్థ చేసిన రీసెర్చ్ను, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది. ఇండియాలో భర్తలపై దాడులు 15 ఏండ్లలో దాదాపు ఐదింతలు పెరిగినట్టు ఈ రీసెర్చ్లో గుర్తించారు. ప్రతి వెయ్యి మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయి చేసుకుంటున్నారని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు.
ఈ సంఖ్య 2006-లో ఏడు మాత్రమే ఉందని పేర్కొంది. ఇతర దేశాల్లో డొమెస్టిక్ వయలెన్స్ చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉన్నాయని, ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని రీసెర్చ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, లా మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేయాలని స్టడీ సూచించింది. ఇతర దేశాల్లో చేసిన చట్టాలను రిపోర్ట్లో పొందుపర్చింది.
తాగినా తంతున్నం.. తాగపోయినా తంతున్నం..
భర్తలను కొడుతున్న భార్యల ప్రవర్తన, తన్నులు తింటున్న భర్తల ఎడ్యుకేషన్, తాగుడు అలవాటు.. తదితర అంశాలపై కూడా ఈ రీసెర్చ్లో పేర్కొన్నారు. భర్త రెగ్యులర్గా ఆల్కహాల్ తాగి ఇబ్బందులకు గురి చేస్తుండడం వల్లే కొట్టాల్సి వస్తున్నదని 18.4 శాతం మంది మహిళలు తెలిపారు. అప్పుడప్పుడు తాగుతాడని, తాగినప్పుడు గొడవ చేస్తాడని, ఆ సమయంలో కొట్టాల్సి వస్తుందని 6.5 శాతం మంది భార్యలు వెల్లడించారు. భర్త తనను కొట్టడంతో, తాను రివర్స్లో కొట్టానని 10.9 శాతం మంది తెలిపారు. భర్త కొట్టకపోయినా, ఇతర కారణాలతో తాము కొట్టాల్సి వచ్చిందని 6.1 శాతం మంది మహిళలు వెల్లడించారు.
గ్రామాల్లోనే ఎక్కువ..
భర్తలపై మహిళల దాడులు పట్టణ (3.3 శాతం) ప్రాంతాల కంటే, గ్రామీణ(3.7 శాతం) ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. పదో తరగతి కంటే తక్కువ చదివిన భర్తల్లో 3.2 శాతం నుంచి 4.5 శాతం మంది దాడులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి అంతకంటే, ఎక్కవ చదివిన భర్తల్లో 2.3 శాతం నుంచి 2.8 శాతం మంది మాత్రమే దెబ్బలు తింటున్నారు. భర్తలను కొడుతున్న వారిలో నిరక్షరాస్యులు 4.5 శాతం ఉండగా, ఇంటర్మీడియెట్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన మహిళలు 2.2 శాతమే ఉన్నారు.
మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువే..
రాష్ట్రంలో భర్తలపై భార్యల దాడులు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా మగాళ్లు తాగుడుకు బానిసలై భార్యలను వేధించడమే ముఖ్యకారణంగా కనిపిస్తోంది. గత పదేండ్లలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వమే ప్రతి ఊరిలో వైన్ షాపులు, ప్రతి గల్లీలో బెల్టు షాపులు పెట్టించి లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహించింది. ఎక్సైజ్ ఆఫీసర్లు, సిబ్బంది టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంది. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి ఎక్కువైంది.
ఇలా రకరకాల కారణాలతో జనాలు తాగుడుకు బానిసలయ్యారు. చాలా మంది మద్యానికి బానిసలై భార్య, బిడ్డలను పట్టించుకోవడం లేదు. ఇది కాస్తా కుటుంబ కలహాలకు, వయలెన్స్కు దారి తీస్తోంది. రాష్ట్రంలో రోజూ ఏదో చోట తాగొచ్చి వేధిస్తున్న వ్యక్తులు హత్యకు గురవుతున్నారు. భార్య, కన్నబిడ్డలు, తల్లిదండ్రులే తాగుబోతులను హతమారుస్తున్న ఘటనలు బోలేడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాలతో తాగుడు అలవాటు మాన్పించే డీఅడిక్షన్ సెంటర్లు పెట్టాలని డాక్టర్లు కొత్త ప్రభుత్వానికి సూచిస్తున్నారు.