స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున టెస్టులు ఆడి రెండేళ్లకు పైగానే అవుతోంది. రీసెంట్గా భారత జట్టు తరఫున బరిలోకి దిగని ఏకైక ప్లేయర్ కుల్దీపే. ఫిట్గా ఉన్నా ఫైనల్ ఎలెవన్లో అతడికి చోటు దక్కడం లేదు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో కుల్దీప్ బరిలోకి దిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భారత్ భావిస్తోందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరంగా ఉన్నందున అశ్విన్కు జతగా టీమ్లో కుల్దీప్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై కుల్దీప్ స్పందించాడు. తనకు అవకాశం లభిస్తే రాణించేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు.
‘రీసెంట్గా ముగిసిన శ్రీలంక పర్యటనలో ఇంగ్లండ్ జట్టు బాగా ఆడింది. లంక స్పిన్ అటాక్ను ఇంగ్లండ్ సమర్థంగా ఎదుర్కొంది. వాళ్లు మంచి టచ్లో, రిథమ్లో కనిపించారు. ఆ జట్టుపై నా ప్లాన్లను అమలు చేయడం సవాల్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను టీమిండియాకు ఆడి చాలా రోజులైంది. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ వన్డేలు, లంకతో టెస్టుల్లో ఆడటాన్ని గమనించా. వారి కోసం నా వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిని నేను విజయవంతంగా అమలు చేయగలనని ఆశిస్తున్నా’ అని కుల్దీప్ పేర్కొన్నాడు.