కోల్కతా: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు మౌనం వీడాడు. గత వారం రోజులుగా జరిగిన పరిణామాలపై ఆచితూచి స్పందించిన దాదా.. జీవితాంతం అడ్మినిస్ట్రేటర్గా ఉండటం కుదరదని, కొన్నిసార్లు తిరస్కరణలు కూడా ఉంటాయని భావోద్వేగంతో మాట్లాడాడు. ‘ఎప్పుడూ ప్లేయర్గా ఉండలేం. అలాగే పాలకుడిగా కూడా ఎక్కువ కాలం కొనసాగలేం. ఈ రెండు పనులను చేసిన నేను నాణేనికి ఇరువైపుల ఎలాంటి అంశాలు ముడిపడి ఉన్నాయో తెలుసుకున్నా. ఫ్యూచర్లో మరింత పెద్ద పదవి కోసం ట్రై చేస్తా. నేను క్రికెటర్ల అడ్మినిస్ట్రేటర్ని. ప్రస్తుతం క్రికెట్ చాలా ఎక్కువగా జరుగుతుండటం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.
క్రికెట్ చుట్టూ చాలా డబ్బు ఉంది. విమెన్స్, డొమెస్టిక్ క్రికెట్ వల్ల వ్యక్తిగతంగా కొన్నిసార్లు భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నా’ అని దాదా వ్యాఖ్యానించాడు. జీవితంలో విజయం సాధించాలంటే ఓపికగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక్క రోజులో సచిన్, అంబానీ, మోడీ కావాలంటే కాలేరన్నాడు. ‘నాకు జీవితంపై చాలా విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరికి గడ్డు కాలం ఎదురవుతుంది. దానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. జీవితంలో ఏదో ఓ దశలో తిరస్కరణకు కూడా గురవుతాం. ఎందుకంటే ఇది లైఫ్ సైకిల్. కానీ స్థిరంగా ఉండేది మాత్రం మన సామర్థ్యంపై నమ్మకం మాత్రమే. ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. జీవితం, విజయాలు, పురోగతి.. చిన్న టార్గెట్స్. సచిన్, అంబానీ, మోడీలా కావాలంటే రోజులు, వారాలు, నెలలు దాని కోసం వెచ్చించాలి. అదే విజయానికి కీలకం. దాని కోసం ఉత్తమంగా కష్టపడాలి’ అని సౌరవ్ పేర్కొన్నాడు.