
- టెస్టుల్లోనూ స్టాప్ క్లాక్ ఈ డబ్ల్యూటీసీ సైకిల్ నుంచే అమలు
- నో బాల్కు రన్స్లోనూ మార్పులు
- షార్ట్ రన్ తీస్తే ఐదు పరుగుల పెనాల్టీ
- స్వల్ప మార్పులతో డీఆర్ఎస్
దుబాయ్: టెస్టు క్రికెట్పై ఆసక్తి పెంచేందుకు ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ను మార్చింది. ఇందులో భాగంగా కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకొచ్చింది. స్లో ఓవర్ రేట్ను తగ్గించేందుకు కొత్తగా ఈ ఫార్మాట్లో స్టాప్ క్లాక్ను ప్రవేశపెట్టింది. షార్ట్ రన్ తీస్తే ఏ బ్యాటర్ స్ట్రైక్లో ఉండాలో నిర్ణయించుకోవడానికి ఫీల్డింగ్ జట్లకు అనుమతి ఇచ్చింది. 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుతోనే ఇవి అమల్లోకి వచ్చాయి.
‘ఫీల్డింగ్ జట్టు మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తర్వాతి ఓవర్ను ప్రారంభించాలి. ఇందుకోసం సున్నా నుంచి 60 సెకన్ల వరకు లెక్కించే ఎలక్ట్రానిక్ క్లాక్ గ్రౌండ్లో ప్రదర్శించబడుతుంది. ఈ క్రమంలో ఫీల్డింగ్ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తారు. మూడోసారి ఉల్లంఘన జరిగితే బ్యాటింగ్ జట్టుకు ఐదు రన్స్ పెనాల్టీగా ఇవ్వబడతాయి. 80 ఓవర్లు పూర్తి అయిన తర్వాత ఈ హెచ్చరికలు సున్నాకు రీసెట్ అవుతాయి’ అని ఐసీసీ వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ ఇప్పటికే వన్డే, టీ20ల్లో అమలు చేస్తున్నారు.
సలైవా వల్ల బాల్ను మార్చరు..
బంతిపై సలైవా రుద్దడంపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ.. బాల్పై అది కనిపించిన వెంటనే అంపైర్లు దానిని మార్చడం ఇక తప్పనిసరి కాదని ఐసీసీ తెలిపింది. బంతి స్వరూపాన్ని మార్చడానికి దానిపై బలవంతంగా సలైవాను రుద్దే పరిస్థితిని నివారించడానికి ఈ మార్పును తీసుకొచ్చారు. ఒకవేళ బాల్ స్వరూపం పూర్తిగా మారిపోయిందని అంపైర్లు భావిస్తే అప్పుడు మారుస్తారు. తడి, ఎక్కువ మెరుపు ఉన్నప్పుడు అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు. సలైవా వేయడం వల్ల బాల్ స్వరూపం మారితే బ్యాటింగ్ జట్టుకు ఐదు రన్స్ ఇవ్వబడతాయి.
అంపైర్ కాల్ వచ్చినా ఔటే..
డీఆర్ఎస్లోనూ ఐసీసీ స్వల్ప మార్పు చేసింది. ఈ రూల్ ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్న జట్టు క్యాచ్ కోసం అప్పీల్ చేస్తుంది. ఈ టైమ్లో అంపైర్ ఔటిస్తే.. బ్యాటింగ్ చేసే జట్టు రివ్యూకు వెళ్తుంది. అప్పుడు అంపైర్ మొదట అల్ట్రా ఎడ్జ్ను చెక్ చేస్తాడు. ఒకవేళ బాల్.. బ్యాట్కు తగలకపోతే ఎల్బీ కోసం చెక్ చేస్తాడు. ఎల్బీలో ఔట్ అని తేలినా, లేకపోతే అంపైర్ కాల్ వచ్చినా దాన్ని ఔట్గానే ప్రకటిస్తారు.
అంపైర్, ప్లేయర్ కలిసి చేసే సమీక్షలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీ అంపైర్ రివ్యూను పరిశీలించే ముందు అంపైర్ నిర్ణయాన్ని అడిగేవాడు. ఒకవేళ బ్యాటర్ ఔట్ అయితే దాన్ని డెడ్బాల్గా ప్రకటించేవారు. కానీ సవరించిన రూల్స్ ప్రకారం ఎల్బీ, రనౌట్ కోసం అప్పీలు చేస్తే టీవీ అంపైర్ మొదట ఎల్బీ రివ్యూను తీసుకుంటాడు. ఇందులో బ్యాటర్ ఔట్ అని తేలితే డెడ్బాల్గా ప్రకటిస్తారు.
నో బాల్కు నో రన్స్..
నో బాల్కు క్యాచ్ తీసుకున్నప్పుడు అది క్లీన్ క్యాచా? కాదా? అని చెక్ చేస్తారు. ఒకవేళ క్లీన్ క్యాచ్ అయితే అప్పటి వరకు తీసిన రన్స్.. బ్యాటింగ్ జట్టుకు జత చేయరు. కేవలం నో బాల్కు వచ్చే రన్ మాత్రమే బ్యాటింగ్ జట్టు స్కోరుకు యాడ్ చేస్తారు. ఒకవేళ క్లీన్ క్యాచ్ కాకపోతే బ్యాటర్లు పూర్తి చేసిన రన్స్ను జట్టు స్కోరుకు జత చేస్తారు.
అంతేకాకుండా క్యాచ్ను సరిగా పట్టకుండా ఔట్ అని అప్పీల్ చేస్తే థర్డ్ అంపైర్ చెక్ చేసిన తర్వాత అది క్లీన్ క్యాచ్ కాదని నాటౌట్గా తేలితే నో బాల్గా ప్రకటిస్తారు. బ్యాటర్లు కొన్ని సందర్భాల్లో రన్ పూర్తి చేసే క్రమంలో బ్యాట్ క్రీజులో (షార్ట్ రన్) పూర్తిగా పెట్టరు. ఆ టైమ్లో అంపైర్లు చెక్ చేసి ఆ రన్ కేటాయించే వారు కాదు. కొత్త రూల్ ప్రకారం బ్యాటర్ క్రీజులో పూర్తిగా బ్యాట్ పెట్టకపోతే ఆ జట్టుకు 5 రన్స్ పెనాల్టీ వేస్తారు. తర్వాత ఎవరు స్ట్రయిక్ చేయాలనేది ఫీల్డింగ్ జట్టు నిర్ణయించుకోవచ్చు.