- ఇద్దరు మృతి.. 14 మందికి గాయాలు
- గనిలో చిక్కుకున్న మరి కొంతమంది కార్మికులు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
ఇండోనేషియాలోని నార్త్ సులావేసిలోని బొలాంగ్ మంగ్డోవ్ రీజియన్లో అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోగా.. మరో 14 మంది గాయాలతో బయటపడ్డారు. చాలా మంది కార్మికులు గనిలోనే చిక్కుకుపోయారని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. మట్టి పెళ్లలు, సపోర్టింగ్ బోర్డులు విరిగిపడి ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. “గనిలోపలికి చాలా మంది కార్మికులు వెళ్లారు. వారిలో ఇద్దరు చనిపోయారు.. మరో 14 మందిని కాపాడాం. మిగతా వారి జాడ తెలియడం లేదు. గని లోపల నుంచి కాపాడండి అంటూ కేకలు వినిపిస్తున్నాయి. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం” అని విపత్తు నిర్వహణ అధికారి చెప్పారు.
గని చాలా నిటారుగా ఉన్నందు వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. నార్త్ సులావేసిలో అధిక సంఖ్యలో అక్రమ బంగారు గనులను నిర్వహిస్తారు. గనుల్లో పనికి వెళ్లే కార్మికుల కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. దీంతో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. 2015లో కూడా ఇదే తరహా ఘటన జరిగిందని, ఆ ప్రమాదంలో 12 మంది, 2016లో జరిగిన ఘటనలో 11 మంది కార్మికులు చనిపోయారని స్థానికులు చెప్పారు.