ENG vs IND 2025: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం : 5 సెంచరీలు చేసినా ఓడిన జట్టుగా ఇండియా..

ENG vs IND 2025: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం : 5 సెంచరీలు చేసినా ఓడిన జట్టుగా ఇండియా..

లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓటమి జీర్ణించుకోలేనిది. బ్యాటింగ్ ఎలా ఆడతారో అనే సందేహాలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు సెంచరీల వర్షం కురిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మనోళ్లు ఐదు సెంచరీలు కొట్టేశారు. తొలి ఇన్నింగ్స్ లో మూడు.. రెండో ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు భారత క్రికెటర్లు కొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మొదట జైశ్వాల్ (105) సెంచరీతో భారత్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించారు. 

రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ 137 పరుగులు చేసి జట్టుకు వెన్నుముకగా నిలబడితే.. పంత్ 118 పరుగులు చేసి ఈ టెస్టులో రెండు రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. గతంలో ఒక భారత క్రికెటర్ ఇంగ్లాండ్ గడ్డపై ఒక్క సెంచరీ చేస్తేనే ఔరా అనుకుంటే.. లీడ్స్ టెస్టులో నలుగురు టీమిండియా బ్యాటర్లు సెంచరీలు బాదారు. పంత్ రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు బాదడంతో మొత్తం 5 సెంచరీలు నమోదయ్యాయి. ఐదుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసినప్పటికీ మ్యాచ్‌లో ఓడిపోయిన తొలి జట్టుగా నిలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు 5 సెంచరీలు చేసి కూడా ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం సంచలనంగా మారింది. 

148 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఊహించని చెత్త రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. 1928లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టులో నలుగురు సెంచరీలు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. గిల్ కెప్టెన్ గా తొలి టెస్ట్ సెంచరీ.. పంత్ రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు.. రాహుల్ వరుసగా మూడో సారి ఇంగ్లాండ్ పై సెంచరీ.. జైశ్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై తొలి సెంచరీ అన్ని వృధా అయిపోయాయి. లోయర్ ఆర్డర్ రాణించకపోవడంతో భారత్ రెండు ఇన్నింగ్స్ ల్లో భారీ స్కోర్లు చేయలేకపోయాయి. 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ జూలై 2 న ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది.