
- ప్రస్తుతం 21/0
- రెండో ఇన్నింగ్స్లో ఇండియా 364 ఆలౌట్
- రాహుల్, రిషబ్ సెంచరీల జోరు
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇండియాను గెలిపించే బాధ్యత ఇప్పుడు బౌలర్లపై పడింది. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (247 బాల్స్లో 18 ఫోర్లతో 137), రిషబ్ పంత్ (140 బాల్స్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 118) సెంచరీలతో చెలరేగడంతో.. ఇంగ్లండ్ ముందు 371 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 ఓవర్లలో 21/0 స్కోరు చేసింది. జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 90/2 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో 96 ఓవర్లలో 364 రన్స్కు ఆలౌటైంది.
ఈసారి రాహుల్, పంత్
96 రన్స్ ఓవర్నైట్ లీడ్తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఇండియాకు రాహుల్, రిషబ్ పంత్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో భారీ స్కోరు అందించారు. డే ఏడో బాల్కే బ్రైడన్ కార్సీ (3/80) వేసిన గుడ్ లెంగ్త్ బాల్కు కెప్టెన్ శుభ్మన్ గిల్ (8) వెనుదిరిగాడు. దీంతో స్కోరు 92/3గా మారింది. ఈ దశలో వచ్చిన పంత్ సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన ప్యాడిల్ స్వీప్, ర్యాప్ షాట్స్తో మెరుపులు మెరిపించాడు. మేఘావృత వాతావరణంలో ఇంగ్లిష్ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్తో ఇబ్బందిపెట్టినా ఈ ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో రాహుల్ 87 బాల్స్లో ఫిఫ్టీ కొట్టగా, ఇండియా 153/3తో లంచ్కు వెళ్లింది. ఇక రెండో సెషన్లో పంత్ మరింత దూకుడుగా ఆడాడు. క్రిస్ వోక్స్ (1/45) బౌలింగ్లో స్లిప్ కార్డన్ మీదుగా డేంజర్ షాట్స్ ఆడాడు. రాహుల్ స్వీప్, స్లాగ్ స్వీప్తో బౌండ్రీలు రాబట్టాడు. 83 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసిన పంత్ వికెట్ కోసం స్టోక్స్ రివ్యూ కూడా వృథా చేశాడు. జోష్ టంగ్ (3/72) బౌలింగ్లో రాహుల్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో బ్రూక్ డ్రాప్ చేశాడు. ఆ వెంటనే 202 బాల్స్లో సెంచరీ అందుకున్నాడు. లాంగాన్, లాంగాఫ్లో భారీ సిక్స్లు కొట్టిన పంత్ కూడా 130 బాల్స్లోనే వంద పూర్తి చేశాడు. పంత్ కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.
అయితే 72వ ఓవర్లో షోయబ్ బషీర్ (2/90) వేసిన టర్నింగ్ బాల్ను భారీ సిక్స్గా మలిచే క్రమంలో లాంగాన్లో క్రాలీ చేతికి చిక్కాడు. ఫలితంగా నాలుగో వికెట్కు 195 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కరుణ్ నాయర్ (20)తో కలిసి మెల్లగా ఆడిన రాహుల్ 298/4 స్కోరు వద్ద టీ బ్రేక్కు వెళ్లాడు. ఇక మూడో సెషన్లో ఒక్కసారిగా ఇంగ్లండ్ బౌలర్లు పట్టు బిగించారు. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ను 83వ ఓవర్లో కార్సీ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఐదో వికెట్కు 46 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. మరో 9 బాల్స్ తర్వాత నాయర్ను వోక్స్ కాటన్ బౌల్డ్గా పెవిలియన్కు చేర్చాడు. రెండు రన్స్ తేడాతో ఈ రెండు వికెట్లు పడటంతో స్కోరు 335/6గా మారింది. ఈ టైమ్లో జడేజా (25 నాటౌట్) దీటుగా ఆడినా.. 91వ ఓవర్లో నాలుగు బాల్స్ తేడాలో టంగ్.. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0)ను ఔట్ చేశాడు. కొద్దిసేపటికే ప్రసిధ్ కృష్ణ (0)ను బషీర్ వెనక్కి పంపాడు. ఓవరాల్గా 21 ఓవర్లలో 66 రన్స్ తేడాలో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్. ఇండియా రెండో ఇన్నింగ్స్: 96 ఓవర్లలో 364 ఆలౌట్ (రాహుల్ 137, రిషబ్ 118, కార్సీ 3/80, టంగ్ 3/72). ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 6 ఓవర్లలో 21/0 (జాక్ క్రాలీ 12* డకెట్ 9*).