న్యూఢిల్లీ: సిటిజన్షిప్ చట్టం సెగ ఇండియా క్రికెట్ను కూడా తాకింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా గువాహతి వేదికగా జనవరి 5న జరిగే తొలి టీ20పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణ, ఆటగాళ్లకు సెక్యూరిటీ కల్పించే అంశాలను అసోం క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ పరిశీలిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మ్యాచ్ వేదికను మారుస్తామని, కొంత సమయం మాత్రం వేచి చూస్తామని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. మ్యాచ్కు ఇంకా మూడు వారాల సమయం ఉందని అప్పటి వరకు అంతా సర్దుకుంటుందని అసోం క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిక్షిత్ దత్తా తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో గువాహతి వేదికగా అసోం-సర్వీసెస్ రంజీ మ్యాచ్ నాలుగో రోజు ఆట రద్దయింది. ఆటగాళ్లంతా హోటల్స్కే పరిమితమయ్యారు. అలాగే, కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా అసోం-ఒడిశా మ్యాచ్ కూడా రద్దయింది.

