
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ)లో పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టడంపై ఆరోపణలు రావడంతో ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం ప్రెసిడెంట్ కాసాని వీరేష్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన టీకేఏ ఏజీఎంలో సంఘం ప్రతినిధులు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంఘానికి చెందిన రూ. కోటి పైచిలుకు నిధుల గోల్మాల్ ఆరోపణలతో మాజీ సెక్రటరీ జగదీశ్ యాదవ్, మాజీ ట్రెజరర్ శ్రీరాములుపై ఎఫ్ఐఆర్ నమోదైన అంశం కూడా ఏజీఎంలో చర్చకు వచ్చింది.
అయితే ఈ ఆరోపణలు గత పాలకవర్గంపై వచ్చినవని వీరేష్ చెప్పారు. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు సీనియర్ మెంబర్ అజీజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. కమిటీకి వారం రోజుల గడువు ఇచ్చామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.