మన దేశంలో తయారుచేసిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మన తొలి స్వదేశీ విమాన వాహక నౌక (ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్) ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్ర పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. ఈ ట్రయల్స్తో సొంతగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసే సత్తా ఉన్న దేశాల లిస్టులో ఇండియా చేరింది. రూ. 23 వేల కోట్లతో తయారు చేసిన ఈ క్యారియర్ వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత నుంచి ఇండియన్ నేవీకి సేవలందించనుంది. విక్రాంత్ సీ ట్రయల్స్ సందర్భంగా ఇండియన్ నేవీ స్పోక్స్పర్సన్ కమాండర్ వివేక్ మధ్వల్ మాట్లాడుతూ.. ‘ఇది ఇండియా గర్వించదగ్గ రోజు. 1971లో ఐఎన్ఎస్ విక్రాంత్ ముఖ్య పాత్ర పోషించింది. తర్వాత డీ కమిషన్ అయింది. యుద్ధం జరిగి 50 ఏళ్లయిన సందర్భంగా కొత్తగా తయారుచేసిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కు ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు పెట్టారు’ అని చెప్పారు. దేశంలో తయారు చేసిన అతి పెద్ద, క్లిష్టమైన వార్షిప్ ఇదేనని చెప్పారు. విక్రాంత్ పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు.బరువు 40 వేల టన్నులు. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. కొచ్చి షిప్యార్డ్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. 30 ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు దీనిపై దిగగలవు. ఇప్పుడు మనదేశంలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒక్కటే ఉంది.