టెక్నాలజీ పీక్స్... వచ్చేసిందిగా దోశ ప్రింటర్

టెక్నాలజీ పీక్స్... వచ్చేసిందిగా దోశ ప్రింటర్

బ్రేక్ ఫాస్ట్ లలో చాలా మందికి ఫెవరేట్ టిఫిన్ అయిన దోశను చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. ముందు రోజే పిండి రుబ్బి నానబెట్టుకోవాలి. ఇక ప్రస్తుత జనరేషన్ లో అయితే మార్కెట్లో ఇన్‌స్టంట్ దోశ పిండి కూడా లభిస్తోంది. ఆ పిండి తెచ్చుకొని ప్యాన్ పైన దోశలువేసుకుంటే చాలు. పని అయినట్టే. కానీ టెక్నాలజీ పెరిగిపోయినకొద్దీ అన్ని పనులూ ఈజీగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి దోశలు వేసుకోవడం కూడా  చేరిపోయింది. మామూలుగా దోశ చేయాలంటే పిండిని ప్యాన్ మీద వేయాలి. ఆ తర్వాత బాగా వేగాక దించేయాలి. కానీ ఆ అవసరం లేకుండానే దోశలు చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారు.. అందుకోసం దోశ ప్రింటర్ (Dosa Printer) వచ్చేసింది. 

వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నా... అదే నిజమంటోంది ఈ కిచెన్ గ్యాడ్జెట్ తయారు చేసిన చెన్నైకి చెందిన ఇవోచెఫ్ అనే కంపెనీ. ఈ మెషీన్ చూడ్డానికి ప్రింటర్ లాగానే ఉంటుంది. అందులో ఓవైపు నుంచి పిండి పోస్తే మరోవైపు నుంచి దోశలు ప్రింటయి వస్తాయి. ఈ ప్రింటర్ ద్వారా కరకరలాడే దోశలు ప్రింట్ అవుతున్నాయి. ఇందులో దోశ ఎంత మందంలో ఉండాలి, ఎంత సమయంలో కావాలో సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక బటన్లు కూడా ఉన్నాయి. ఈ దోశ తయారీలో నెయ్యి, వెన్న, చీజ్ వంటి అదనపు పదార్ధాలను కూడా జోడించవచ్చట.'ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ దోస తయారు చేసే మెషిన్ గా పేరు పొందిన ఈ పరికరం పేరు ఈసీ ఫ్లిప్ గా నామకరణం చేశారు. కాగా దీని ధర రూ.15,999 అని కంపెనీ వెబ్ సైట్ఇచ్చిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఇది ఒకే సారి 10నుంచి12 సన్నని దోసెలు లేదా 6 నుంచి 8 మందపాటి దోసెలు తయారు చేయగలదని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియోలో బాగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చూపినట్టు ప్రింట్ అయిన దోశల్ని ప్లేట్‌లో పెట్టుకొని చట్నీతో తినేస్తే సరి. ఈ ఐడియా ఏదో బాగుందే అని అనిపించినా...  ఈ టెక్నాలజీపై ఆన్‌లైన్‌లో సెటైర్లు వస్తున్నాయి. ఇలాంటి గ్యాడ్జెట్స్, మెషీన్లు మానవ జీవితం సులభతరం చేస్తుందన్న విషయం తెలుసుకానీ, మరీ ఈ రకమైన టెక్నాలజీ వస్తుందని అనుకోలేదని నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో రోటీ మేకర్స్, డిష్ వాషర్స్ లాంటివి ఎన్నో గ్యాడ్జెట్స్, అప్లయెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దోశ ప్రింటర్ రావడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.