- ఫస్ట్ టైమ్ 11 మందికి 10 ప్లస్ కోట్లు
- మెగా ఆక్షన్లో మస్తు రికార్డులు
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
అందరూ ఆసక్తిగా చూసిన రెండు రోజుల ఐపీఎల్ మెగా ఆక్షన్ క్రికెట్ మ్యాచ్ల మాదిరి మజా పంచింది. 600 మంది పోటీదారుల్లో 204 మందికే చాన్స్ వచ్చింది. మొత్తంగా పది ఫ్రాంచైజీలు 550 కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో 126 కోట్లు కేవలం 11 మందిపైనే కుమ్మరించాయి. ఓవర్నైట్లో 28 మంది ఆటగాళ్లు మిలియనీర్స్ అయ్యారు. గతానికి భిన్నంగా సాగిన ఈ ఆక్షన్లో కొందరు ఊహించని ధర పలికితే.. స్టార్లు అనుకున్న వాళ్లలో చాలా మంది అన్సోల్డ్గా మిగిలిపోయారు. మధ్యలో కుర్రాళ్లు లాభపడినా.. ఫారిన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేయడం మరో విశేషం.
11 మందికి కోట్లే.. కోట్లు
ఈ ఆక్షన్లో 11 మంది ప్లేయర్లు రూ. 10 కోట్లకు పైగానే ధర పలికారు. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. అందులో ఇండియన్స్ ఏడుగురు ఉండటం విశేషం. ఈ లిస్ట్లో ఇద్దరు పాత ప్లేయర్లను తిరిగి రిటైన్ చేసుకోవడానికి రెండు ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ కోసం ముంబై రూ. 15.25 కోట్లు చెల్లిస్తే, దీపక్ చహర్కు చెన్నై రూ. 14 కోట్లు వెచ్చించింది. ఇక ఇంగ్లిష్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ కోసం పంజాబ్ 11.50 కోట్లు పెట్టడం మరో సర్ప్రైజ్.
గీత దాటిన చెన్నై, ముంబై
ఈ వేలంలో మరో హైలెట్... చెన్నై సూపర్కింగ్స్ తన ఫైనాన్షియల్ రూల్స్ను ఈసారి పక్కనబెట్టింది. ప్రతి ప్లేయర్ను పక్కా లెక్కతో కొనుగోలు చేసే సీఎస్కే.. దీపక్ చహర్ (రూ. 14 కోట్లు) విషయంలో కోట్లు కుమ్మరించింది. సింగిల్ ప్లేయర్ కోసం చెన్నై డబ్బుల గీత దాటడం ఇదే మొదటిసారి. దీంతో మెగా లీగ్లో చహర్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. దీంతో పాటు తమ కెప్టెన్ ధోనీ కంటే రెండు కోట్లు ఎక్కువగానే తీసుకోవడం మరో విశేషం. చెన్నై దారిలోనే ముంబై ఇండియన్స్ కూడా ఒక్క ప్లేయర్ (ఇషాన్ కోసం 15.25 కోట్లు) కు తొలిసారి రూ. 10 కోట్లకు పైగా బిడ్ వేయడం ఆ టీమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్. ఐదుసార్లు టీమ్ను చాంపియన్గా నిలిపిన రోహిత్కు రూ. 16 కోట్లే ఇస్తున్నారు. అలాగే, ఇషాన్, ఆర్చర్, టిమ్ డేవిడ్ కోసమే ఏకంగా 31.75 కోట్లు ఖర్చు చేసింది. మిగతా 18 మంది కోసం 16.40 కోట్లు ఖర్చు పెట్టింది. టీమ్లోకి 11 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లను తీసుకుంది.
అన్క్యాప్డ్గా అవేశ్ రికార్డు..
140 కేఎంపీహెచ్ స్పీడ్తో బాల్స్ వేసే పేసర్ అవేశ్ ఖాన్కు లక్నో సూపర్జెయింట్స్ రూ. 10 కోట్లు పెట్టడం సరికొత్త రికార్డు. ఐపీఎల్ హిస్టరీలో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్కు ఇంత పెద్ద మొత్తం పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. అవేశ్ బేస్ప్రైస్ రూ. 20 లక్షలు. 2017లో ఐపీఎల్ డెబ్యూ చేసిన అవేశ్ ఓవరాల్గా 25 మ్యాచ్ల్లో 29 వికెట్లు తీశాడు.
ఐదుగురి రేటు 2000 శాతం పెరిగింది...
ఈ ఆక్షన్లో ఐదుగురు ప్లేయర్ల రేటు గత సీజన్తో పోలిస్తే 2000 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అందులో నలుగురు 2021లో ఆర్సీబీకే ఆడిన వాళ్లు కావడం విశేషం. అందులో ఇద్దరైన హర్షల్ పటేల్, వానిందు హసరంగ ఈసారి కూడా ఆ టీమ్కే సెలెక్ట్ అయ్యారు. గతేడాది కేవలం 20 లక్షలకే తీసుకున్న హర్షల్ కోసం ఆర్సీబీ ఈసారి ఏకంగా 10.75 కోట్లు పెట్టింది. పోయినేడాది కంటే హర్షల్ శాలరీ ఏకంగా 53.75 రెట్లు పెరిగింది. అదే టైమ్లో మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ రేటు దాదాపు 50 రెట్లు పెరిగింది. 2018లో 20 లక్షల బేస్ప్రైస్తో అతడిని కోల్కతా తమ టీమ్లోకి తీసుకోగా.. రాజస్తాన్ ఈసారి పది కోట్లు ముట్టజెప్పింది.
కృష్ణప్ప 9 కోట్ల నుంచి 90 లక్షలకు..
ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్కు లాస్ట్ ఇయర్ తీపిగుర్తు అయితే.. ఈసారి మాత్రం చేదు జ్ఞాపకం. లాస్ట్ సీజన్లో సీఎస్కే అతడిని 9.25 కోట్లకు తీసుకొని అందరికీ షాకిచ్చింది. కానీ, ఆ రేటుకు న్యాయం చేయని అతడిని వదులుకుంది. ఈసారి లక్నో టీమ్ గౌతమ్ను 90 లక్షలకే కొనుక్కుంది. అంటే అతని ధర ఏకంగా 90.27 శాతం పడిపోయింది. గతేడాది 5 కోట్లు (సీఎస్కే) పలికిన కర్ణ్ శర్మ ఈసారి 50 లక్షలకే ఆర్సీబీకి వెళ్లాడు. 2017లో ఆర్సీబీ 12 కోట్లకు కొన్న తైమల్ మిల్స్ను ముంబై ఈసారి కోటిన్నరకే కొన్నది. లాస్ట్ సీజన్లో పంజాబ్ 8 కోట్లకు తీసుకున్న మెరిడిత్ను కూడా ముంబై కోటి రూపాయలకే దక్కించుకుంది.