
పశ్చిమాసియా రీజియన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మిసైళ్లను ప్రయోగించే అవకాశం ఉంది. అదేవిధంగా, అత్యధిక జనాభా నివాసం ఉండే న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి కీలక నగరాలపై బాంబు దాడులకు దిగే చాన్స్ ఉంది.ఈ నేపథ్యంలో ప్రార్థనా మందిరాలు, రద్దీగా ఉన్న చోట భద్రతను కట్టుదిట్టం చేసినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు.
న్యూక్లియర్ ప్లాంట్లే లక్ష్యంగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అమెరికా కూడా తోడవడంతో దాడులు ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. ఇరాన్ మిలటరీ, ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) లక్ష్యంగా ఇకపై దాడులు ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి మీడియా చెప్తున్నది. తనను తాను కాపాడుకుంటూనే.. శత్రువులపై దాడులకు ఇరాన్ సిద్ధమవుతున్నది.
ఇరాన్ పెంచి పోషించిన హమాస్, హెజ్బొల్లా, హౌతీలు, ఇరాక్లోని పలు మిలీషియా సంస్థలను ఇప్పుడు ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. లెబనాన్, ఇరాక్, యెమెన్ భూ భాగాల నుంచి ఇజ్రాయెల్పై దాడులకు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లను ఉపయోగించుకో వచ్చు. అయితే, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా లీడర్షిప్ తుడిచిపెట్టుకు పోయింది. అటు ఎర్ర సముద్రంలోనూ
హౌతీలను అమెరికా అణిచివేసింది.
ఇరాన్పై అమెరికా దాడి చేయడంతో.. చైనా, రష్యా పేర్లు తెరమీదికి వచ్చాయి. పరోక్షంగా ఈ రెండు దేశాలు ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా దాడులను చైనా ఖండిస్తున్నది. అటు ఇజ్రాయెల్కూ.. చైనా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా వైఖరిని అటు రష్యా కూడా ఖండిస్తున్నది. బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడిని పుతిన్ తప్పుబట్టారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్ధం ప్రకటిస్తే.. ఇరాన్కు రష్యా, చైనా సహాయం చేసే అవకాశాలున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ ఒంటరైంది. ఈ సమయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% హర్మూజ్ ద్వారానే రవాణా అవుతున్నది. మూడింట ఒకవంతు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా ఇక్కడినుంచే వివిధ దేశాలకు చేరుతుంది.