IND vs ENG: దిగ్గజాలను దాటేశారు: చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా

IND vs ENG: దిగ్గజాలను దాటేశారు: చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా

భారత టెస్టు జట్టులో గత దశాబ్ద కాలంగా స్పిన్నర్లు అంటే రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఠక్కున గుర్తుకొస్తారు. వీరిద్దరూ టెస్ట్ జట్టులో ఉంటే టీమిండియా విజయంపై జట్టు యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ భరోసాగా ఉంటారు. ముఖ్యంగా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ జరిగితే పోటీ పడీ మరీ వికెట్లు తీస్తారు. ప్రత్యర్థి ఎవరైనా ఈ స్పిన్ ద్వయానికి తలొంచాల్సిందే. 12 ఏళ్ల పాటు ఎన్నో వికెట్లు తీసుకున్న ఈ స్పిన్ ద్వయం..తాజాగా భారత స్పిన్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లను అధిగమించి అరుదైన రికార్డ్ నెలకొల్పారు. 
             
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, జడేజా అదరగొట్టారు. పేసర్లు వికెట్లు తీయడానికి శ్రమిస్తే వీరిద్దరూ మాత్రం అలవోకగా ఇంగ్లండ్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించారు. టాపార్డర్ డకెట్, క్రాలి, పోప్ ను అవుట్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఈ జోడీ  503 వికెట్లు తీసి భారత్ తరపు న అత్యంత విజయవంతమైన టెస్ట్ బౌలింగ్ జోడీగా నిలిచారు. 54 మ్యాచ్‌లలో 501 వికెట్లు తీసి ఇప్పటివరకు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌ల పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.

ఈ మ్యాచ్ ముందువరకు 500 వికెట్లు తీసుకున్న ఈ జోడీ ఇంగ్లండ్ తో జరుగుతన్న మొదటి మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్ గా ఈ రికార్డ్ ఇంగ్లండ్ పేస్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. ఈ జోడీ 138 టెస్టు మ్యాచ్‌ల్లో 1039 వికెట్లు తీసి అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవలే బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. వీరి జోడికి బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రికెట్ ఆడుతన్న వారిలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ 81 టెస్టుల్లో 643 వికెట్లతో టాప్ లో ఉన్నారు. 

మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. బెయిర్ స్టో 37 రన్స్, బెన్ డకెట్ 35 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం కెప్టెన్ స్టోక్స్ (8), రెహన్ అహ్మద్ (0) క్రీజ్ లో ఉన్నారు.