
- 55 మంది వాంగ్మూలాలతో 60 పేజీల నివేదిక
- జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని సీజేఐ, రాష్ట్రపతికి సిఫార్సు
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది నిజమేనని దర్యాప్తు ప్యానెల్ తేల్చింది. ఆయన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో పెద్ద ఎత్తున కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలను గుర్తించారు. దీనిపై సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన త్రిసభ్య కమిటీ 60 పేజీల నివేదికను రెడీ చేసింది. కమిటీ ఈ రిపోర్టును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, ప్రధానికి పంపించింది. జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాల్సిందేనని సిఫార్సు చేసింది. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయిన జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టు కొలీజియం ఎలాంటి విధులు కేటాయించకుండా హోల్డ్లో పెట్టింది.
55 మంది నుంచి వాంగ్మూలం..
2025 మార్చి 14న ఢిల్లీలోని యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ టైంలో స్టోర్రూమ్లో కాలిపోయిన నోట్లన్నీ బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు కొలీజియం త్రిసభ్య ప్యానెల్ను నియమించింది. ఈ ఘటనపై మొత్తం 55 మందిని విచారించిన ప్యానెల్ వాళ్లందరి వాంగ్మూలాలు రికార్డ్ చేసింది. జస్టిస్ వర్మ కూతురు, వ్యక్తిగత కార్యదర్శి రాజేందర్ సింగ్ను కూడా విచారించింది. అగ్నిప్రమాదం జరిగిన తెల్లవారుజామునే కాలిపోయిన నోట్ల కట్టలన్నీ అక్కడి నుంచి మాయమయ్యాయని కమిటీ గుర్తించింది. ఫైర్ సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించినా.. వాళ్లు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా రాజేందర్ సింగ్ కంట్రోల్ చేశారని ఆరోపించింది. ‘స్టోర్రూమ్లో 500 నోట్ల కట్టలు పడిఉన్నాయి. అంతపెద్దమొత్తంలో డబ్బు నా జీవితంలో చూడలేదు’ అని కీలక సాక్షి ఒకరు చెప్పినట్లు తెలిసింది.