అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సభ

అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సభ

హైదరాబాద్: అక్టోబర్ 2న సికింద్రాబాదులోని జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభను విజయవంతం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అమీర్ పేట్ లోని ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ శాంతి సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని పాల్ స్పష్టం చేశారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇవాటి నుంచి ప్రచారం మొదలుపెడ్తామని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది తమ అభ్యర్థియేనని పాల్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తామని కేఏ పాల్ తెలిపారు.