- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వాకం
- రూ. 1.71 లక్షలు దుర్వినియోగం
- లోక్సత్తా ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడి
- ఏడాది పాటు తిప్పాకే సమాచారం
- సొమ్ము రికవరీకి డిమాండ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నీటి సరఫరాను బాగుచేయాలనుకున్నారు. ఇందుకోసం మహారాష్ట్రలోని నాగ్పూర్కు వెళ్లి అక్కడి నీటి సరఫరా విధానంపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్, కార్పొరేటర్లు కలిపి 29 మంది నాగ్పూర్కు బయల్దేరారు. మరి వారంతా ప్రజాప్రతినిధులే అనుకుంటున్నారా.. కాదు.. కొందరు మహిళా కార్పొరేటర్లతో వారి భర్తలు బస్సెక్కారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కానివారు 14 మంది ఆ టూర్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన లోక్సత్తా సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. మహిళా ప్రజాప్రతినిధుల విధుల నిర్వహణలో వారి భర్త, బంధువులు పెత్తనం చలాయించడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఆర్టీఐ పిటిషన్తో..
నాగ్పూర్ స్టడీ టూర్కు సంబంధించిన వివరాలు కావాలంటూ లోక్సత్తా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. స్టడీ టూర్ కోసం కరీంనగర్ కార్పొరేషన్ నుంచి రూ. 5.5 లక్షలు ఖర్చు చేశారు. అందులో అనధికారికంగా వెళ్లిన 14 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.12,222 చొప్పున మొత్తం రూ.1.71 లక్షలు దుర్వినియోగమైనట్టు గుర్తించారు.
రికవరీ చేయాలె
‘‘కరీంనగర్ మేయర్, కార్పొరేటర్లు గతేడాది మే 3 నుంచి 6 వరకు నాగ్పూర్ నగరానికి స్టడీ టూర్ కు వెళ్లారు. టూర్ కు కార్పొరేటర్ల భర్తలు వెళ్లారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలి’’ అని లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
నాకు వివరాలు తెలియదు
‘‘గత నేను నెల రోజుల నుంచే కార్పొరేషన్లో పని చేస్తున్నాను. గతంలో జరిగినవి నాకు పెద్దగా తెలియదు’’ అని కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.