బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. ఈసారి 60వేల సీటింగ్ కెపాసిటీ: డికె శివకుమార్

బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. ఈసారి 60వేల సీటింగ్ కెపాసిటీ: డికె శివకుమార్

ఈ నెలలో జరిగిన ఐపీల్ ఫైనల్స్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. అయితే ఆ తర్వాత విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోవటం పెద్ద చర్చకు దారితీసింది. చిన్న స్వామీ స్టేడియం వెలుపల ఎక్కువ సంఖ్యలో వచ్చిన అభిమానులకు అనుగుణంగా ఏర్పాట్లు జరగలేదని తర్వాత ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 

పైగా బెంగళూరు నగరానికి ఇలాంటి విజయోత్సవ వేడుకలను గతంలో నిర్వహించిన అనుభవం కూడా లేకపోవటంతో ప్రమాదం చోటుచేసుకుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం చిన్న స్వామి స్టేడియం అక్కడి నుంచి తరలించాలని మరో చోట కొత్త స్టేడియం కట్టాలని నిర్ణయించింది. 

తాజాగా దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ మాట్లాడుకూ నగరానికి కొత్త స్టేడియం వస్తుందన్నారు. అయితే ఈ సారి నిర్మించే స్టేడియంలో 60వేల మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ కెపాసిటీని పెంచుతున్నట్లు చెప్పారు. పెద్ద ఈవెంట్స్ సమయంలో ఇది ఎక్కువ మంది అభిమానుల తాకిడిని తట్టుకోగలుగుతుందని ఆయన అన్నారు. అలాగే కొత్త స్టేడియం నిర్మాణానికి స్థలం కూడా ఎంపికైందని శివకుమార్ అన్నారు. 

జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవటంతో పాటు చాలా మంది గాయాలపాలయ్యారు. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం నగరం మధ్యన ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవటం పరిస్థితులు అదుపుతప్పేందుకు కారణమైందని వెల్లడైంది. ప్రస్తుతం చిన్న స్వామి స్టేడియం కేవలం 35వేల మందికి అనుగుణంగా ఉండగా.. ప్రమాదం రోజు స్టేడియం వద్దకు 3 లక్షల మంది అభిమానులు వచ్చినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు పోలీసులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం కొందరిని సస్పెండ్ చేసింది.