కరోనా అలర్ట్ : పెద్దోళ్లు అందరూ మాస్కులు పెట్టుకోండి

కరోనా అలర్ట్ : పెద్దోళ్లు అందరూ మాస్కులు పెట్టుకోండి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో అంటే.. డిసెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా 18 వందల కేసులు నమోదు అవ్వగా.. ఒకరు చనిపోయినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు కరోనా కొత్త వైరస్ వేరియంట్ కేసులు నమోదు అవుతుండటంతో.. ఆ పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఓ ప్రకటన చేశారు.

కర్నాటక రాష్టంలోని సీనియర్ సిటిజన్లు అందరూ మాస్క్ పెట్టుకోవాలని.. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. పెద్దలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు. అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు.. కరోనా రిస్క్ ఎక్కువ ఉన్న వారు.. ముంద్ర జాగ్రత్తగా మాస్క్ ధరించాల్సి ఉందని హెచ్చరించారాయన. గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వారు సైతం.. మాస్క్ ధరించాలని సూచించారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది.. కరోనా చికిత్సకు సిద్ధంగా ఉండాలని.. అందుకు అవసరం అయిన ఏర్పాట్లను ముందుగానే చేయాలని సూచించారు కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అనారోగ్యంతో ఉన్న వారికి కరోనా పరీక్షలు చేయాలని.. టెస్టింగ్ కేంద్రాలకు సూచించారు మంత్రి. ప్రభుత్వ ప్రకటనతో కర్నాటకలో సీనియర్ సీటిజన్లు మాత్రమే కాదు.. మిగతా జనం అలర్ట్ అవుతున్నారు. ముందు జాగ్రత్తగా మాస్కులను ధరించాలనే అభిప్రాయానికి వస్తున్నారు.