శ్రీనగర్ : కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో ఆపిల్ పంట్ల తోటలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తూటా గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. కశ్మీర్ లోయలో గత 24 గంటల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిపై దాడి జరగడం ఇది రెండోసారి. సోమవారం అర్ధరాత్రి సెంట్రల్ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని గోపాల్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేయగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.