కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ సర్కార్

కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ సర్కార్
  • మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత విజయశాంతి

హైదరాబాద్: మోసపూరిత మాటలు, కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ సర్కారు మారిపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బతకడం ఒక శాపమని రోదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మనది ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పి అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు చూస్తే ప్రతి నెలా 1వ తేదీకల్లా రావలసిన జీతాలు, పెన్షన్లు పది రోజులవుతున్నా అందని దుస్థితికి తీసుకొచ్చారని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. 
 ఆయా జిల్లాలకు రొటేషన్ పద్ధతిలో ముందు, వెనకలుగా జీతాలు సర్దుబాటు చేస్తూ దాదాపుగా గత 6 నెలల నుంచీ ఇదే పరిస్థితి నెలకొందని మీడియాలో కథనాలు, డిబేట్లు నడుస్తూనే ఉన్నా సర్కారులో చలనం లేదని విజయశాంతి విమర్శించారు. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో సేవలందించే వారి సంగతి చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇది చాలక మరోపక్క బిల్లులు క్లియర్ కావడంలేదని కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారని, ఉద్యోగుల దీనస్థితి ఇలా ఉంటే... మరోవైపు ప్రయివేటు ఉపాధ్యాయుల వేదన మిన్నంటుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలయ్యే వరకూ ప్రయివేట్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు.... 3 నెలలు దాటాక వారిని మర్చిపోయినట్టు వ్యవహరిస్తోందన్నారు.  జులై నెల సహాయం ఇంకా అందలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. అరకొర సాయాలతో తమకు ఒరిగేదేం లేదని ప్రయివేట్ స్కూళ్ల టీచర్లు వాపోతున్నారని, ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలను 'బంధు'వులుగా చూస్తూ.... ఆ నియోజకవర్గాల్లో మాత్రమే కోట్లాది రూపాయల్ని వెదజల్లే ఈ పాలకులకు రాష్ట్రంలోని మిగిలిన పౌరులు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదని విజయశాంతి పేర్కొన్నారు.