ఉగ్రవాద కదలికలతో కేరళ తీరంలో హై అలర్ట్

ఉగ్రవాద కదలికలతో కేరళ తీరంలో హై అలర్ట్

తిరువనంతపురం :  ఉగ్రవాద ముఠా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కి చెందిన 15 మంది ఉగ్రవాదులు శ్రీలంక నుంచి  లక్షద్వీప్ దీవుల మీదుగా కేరళ తీరానికి బయల్దేరినట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ సమాచారంతో  కేరళ పోలీసులు ఆ రాష్ట్ర తీరం ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేరళ తీరం వెంబడి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తీర ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లు, జిల్లా పోలీస్ చీఫ్‌లను అప్రమత్తం చేశామన్నారు.

ఇటువంటి హెచ్చరికలు సాధారణమే అయినా, పోలీసు శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి కచ్చితమైన సందేశమే అని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో తీరం వెంబడి అనుమానాస్పద పడవలు వచ్చే అవకాశం ఉన్నందున,  వాటిని పసిగట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.