ధరణితో స్కామ్​లు సీఎం వేలకోట్లు దోచుకుండు: కోదండరెడ్డి

ధరణితో స్కామ్​లు సీఎం వేలకోట్లు దోచుకుండు: కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధరణి పేరిట స్కామ్​లకు పాల్పడుతున్నారని కిసాన్  కాంగ్రెస్  జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎస్​ను పక్కన పెట్టుకుని సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపించారు. కాంగ్రెస్​హయాంలో ఇచ్చిన భూములను పేద ల నుంచి గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం గాంధీభవన్​లో మీడియాతో కోదండరెడ్డి మాట్లాడారు. ఇప్పటి దాకా 75 లక్షల మంది రైతులకు మాత్రమే పట్టాలు ఇచ్చారని, ఆ పట్టాలు కూడా ఏ రాత్రైనా మాయమైపోవచ్చని అన్నారు.

కాంగ్రెస్  పార్టీ ఏ సంస్కరణలను తీసుకొచ్చినా చట్టపరంగా భద్రత కల్పించేలాగానే ఉండేదన్నారు. ధరణి రికార్డుల ప్రక్షాళన కోసం ప్రతి గ్రామానికి తిరిగి హక్కుదారుల నుంచి చాలా విషయాలను సేకరించామని చెప్పారు. లోతుగా విశ్లేషించిన తర్వాతే ధరణి వెనుక పెద్ద మాఫియా ఉందని రేవంత్​ రెడ్డి అన్నారని ఆయన పేర్కొన్నారు. ధరణి పోర్టల్​లోని తప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.