ENG vs IND 2025: కుల్దీప్‌కు కలిసొచ్చిన ఐపీఎల్.. టీమిండియా స్పిన్నర్‌కు పీటర్సన్ విలువైన సలహాలు

ENG vs IND 2025: కుల్దీప్‌కు కలిసొచ్చిన ఐపీఎల్.. టీమిండియా స్పిన్నర్‌కు పీటర్సన్ విలువైన సలహాలు

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ఓడిపోయిన టీమిండియా రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతుంది. రెండో టెస్ట్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని గిల్ సేన గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బుధవారం (జూన్ 25) బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. టీమిండియా తొలి శిక్షణా సెషన్ బర్మింగ్‌హామ్‌లో జరిగింది. ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెమటోడ్చాడు. రెండో టెస్టుకు ఈ మణికట్టు స్పిన్నర్ జట్టులో చేరడమే దాదాపు ఖాయంగా మారింది. 

తొలి టెస్టులో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తనకు ఇచ్చిన విలువైన సలహాలను కుల్దీప్ యాదవ్ పంచుకున్నాడు. కుల్దీప్ మాట్లాడుతూ..   "కెవిన్ పీటర్సన్ మా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆయన నాకు చాలా సూచనలు ఇచ్చారు. ఫీల్డింగ్ పొజిషన్లు, పిచ్‌లు మరియు బ్యాట్స్‌మెన్ గురించి ఆయన నాకు చెప్పారు. మేము వారి బ్యాటింగ్ లైనప్‌ను పరిశీలించాము. ఇంగ్లాండ్‌ బ్యాటర్ల మైండ్ సెట్ గురించి నాకు చెప్పాడు". అని కుల్దీప్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.. 

ఇంగ్లాండ్‌లో స్పిన్నర్లు డిఫెన్స్ లో పడకూడదని తనకు కెవిన్ పీటర్సన్ చెప్పాడని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. నా మైండ్ సెట్ మార్చుకొని ఎటాకింగ్ మైండ్ సెట్ తో బౌలింగ్ చేయమని సూచించాడు. ఎటాకింగ్ బౌలింగ్ చేయడం వలన నిలకడగా వికెట్లు వస్తాయని ఈ మాజీ ఇంగ్లాండ్ స్పిన్నర్ చెప్పినట్టు కుల్దీప్ యాదవ్ అన్నాడు. నేను మ్యాచ్ లోకి దిగి 15-20 ఓవర్లు బౌలింగ్ వేసినప్పుడు ఎలా వికెట్లు తీయాలో ఆలోచించాలని పీటర్సన్ చెప్పాడని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. తొలి టెస్టులో జడేజా ఉండడంతో భారత్ ఏకైక స్పిన్నర్ తో బరిలోకి దిగింది. అయితే రెండో టెస్టులో మాత్రం జడేజాతో పాటు కుల్దీప్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది.