ప్రజల్లో అవగాహన కలిగించి, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైతేనే హెపటైటిస్ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వరల్డ్ హెపటైటిస్ డే(జులై 28)ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్(ఐఎల్బీఎస్) వార్షిక ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా హెపటైటిస్ బి, సి వ్యాధులపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు.
కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పోలియోపై ఎలాగైతే కలిసికట్టుగా పోరాడి విజయం సాధించామో.. హెపటైటిస్పై పోరాటంలో కూడా ప్రజలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో గొప్పలకు పోయి అతిథులకు మద్యాన్ని ఇవ్వవద్దని, హెపటైటిస్కు లింక్ఉన్న మద్యాన్ని ఇవ్వకుండా పార్టీల్లో కొత్త ట్రెండ్ ప్రారంభించాలని కోరారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ప్రసాద్మాట్లాడుతూ.. హెపటైటిస్ బాధితులపై వివక్ష రూపుమాపేందుకు లేదా వారికి ఉద్యోగాలను నిరాకరించకుండా ఉండేందుకు తగిన చట్టంలో సవరణలు చేయాలంటే పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. కాగా, వైరల్ హెపటైటిస్ గురించి, ఆ వ్యాధి బాధితులపై వివక్ష తొలగించడం కోసమే ‘ఎంపవర్డ్ పీపుల్అగైనెస్ట్ హెపటైటిస్(ఎంపథీ)’ అనే వార్షిక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎల్బీఎస్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలో 6 కోట్ల మంది హెపటైటిస్బాధితులు ఉన్నారని, ఏటా 1.5 లక్షల మంది దీనివల్ల
చనిపోతున్నారని చెప్పారు.