మాయమవుతున్న కాస్ట్లీ కార్లు

మాయమవుతున్న కాస్ట్లీ కార్లు

మీకు విలువైన కారు ఉందా? అయితే జాగ్రత్త? సిటీలో కాస్ట్లీ కార్లు చోరీకి గురవుతున్నాయి. టార్గెట్ చేసిన అంతరాష్ట్ర దొంగలు సింపుల్ గా కొట్టేస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు విలువైంది అయితే చాలు టార్గెట్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి మాయం చేసేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న రెండు ఫార్చ్యూనర్ కార్లు చోరీకి గురయ్యాయి. నాగోలులోని లలితానగర్ కాలనీలో ఉంటున్న స్నేహిత్ రాజ్ భువనగిరిలో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. జూన్ 14న రాత్రి 11:30 గంటలకు తన కారును ఇంటి ముందు నిలిపి ఇంట్లోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి స్విఫ్ట్ కారులో వచ్చిన ఇద్దరు దుండగులు దారిన పోయేవారికి ఏమాత్రం అనుమానం రాకుండా కారు ఓనర్లలా వ్యవహరించి దర్జాగా ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ముందుగా స్విఫ్ట్ కారులో వచ్చిన ఆగంతుకులు ఇంటి ముందు నిలిపిన ఫార్చ్యూనర్ కారు డోరును బ్రేక్ చేసి ఓపెన్​చేశారు. ఆ వెంటనే బ్యానెట్ తెరిచి వాహనానికి అమర్చిన థెఫ్ట్ సౌండ్ రాకుండా చేసి పక్కకు వెళ్లారు. కాసేపటి తరువాత అదును చూసి అక్కడి నుంచి కారుతో పరారయ్యారు. 15వ తేదీన ఇంటి ముందు ఉంచిన కారు కనిపించకపోవడంతో రాజ్​సీసీ కెమెరాలను పరిశీలించాడు. హుటాహుటిన ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు. కారును చోరీచేసిన దుండగులు రాత్రికి రాత్రే రాష్ట్రం దాటి వెళ్లినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో సెర్చ్ చేస్తున్నారు. కారు నంబర్ ప్లేట్ మారుస్తూ నగరం దాటించారని తెలుస్తుంది.

కొత్తపేట వాసవి కాలనీలో..
అలాగే కొత్తపేట వాసవి కాలనీకి చెందిన పుల్లి గిరిధర్ కుమార్(50) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈనెల 18న రాత్రి 8 గంటల సమయంలో తన కారును ఇంటి ముందు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. 19న ఉదయం లేచి చూసేసరికి కారు కనిపించలేదు. వెంటనే చైతన్యపురి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా కాస్ట్లీ కార్లు చోరీకి గురవడంతో స్పెషల్​టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా పోలీసులు పట్టుకోలేకపోవడంతో చోరీకి పాల్పడింది పెద్ద నెట్ వర్క్ ఉన్న ముఠా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎల్బీనగర్ డీ‌సీపీ సంప్రీత్ సింగ్ ను  వివరణ కోరగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకొని కార్లను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.