- రేవంత్ పాదయాత్ర, సభలతో ప్రజల్లో భరోసా: మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించవద్దని బీఆర్ఎస్ నేతలకు పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి హితవు చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో తాము ఓడిపోయినప్పుడు ప్రజల తీర్పును శిరసావహించామన్నారు. ఇప్పుడు ఓడిపోయినవాళ్లు కూడా వారి తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందన్నారు. తమ మహబూబ్నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డిని సీఎంగా తాము సూచిస్తున్నామన్నారు. హైకమాండ్ నేతల అభిప్రాయాలు తీసుకుంటే అందరూ రేవంత్కే ఓటేస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. రేవంత్ చేసిన పాదయాత్రలు, జనసభలతో ప్రజలందరికీ భరోసా ఇచ్చారన్నారు. దీంతో జనం కాంగ్రెస్వైపే నిలబడ్డారన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని, దీంతో జనం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్నారు.