సర్కారు సహకారంతోనే ప్రభుత్వ సంస్థల మనుగడ

సర్కారు సహకారంతోనే ప్రభుత్వ సంస్థల మనుగడ

ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణపై మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ చైర్మన్ ఆర్.సి.భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు.  పబ్లిక్ సెక్టార్ కంపెనీలు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలను చేయడం గురించి ఆలోచించకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ప్రభుత్వ కంపెనీలు వాటి అభివృద్ధి, విస్తరణకు అవసరమైన నిధులను స్వతహాగా సమకూర్చుకోలేకపోతున్నాయని తెలిపారు. ఒకవేళ అవి అభివృద్ధి చెందాలంటే మాత్రం.. ప్రభుత్వం నుంచి మూలధన పెట్టుబడులను సమకూర్చాల్సిన అవసరం ఉంటుందన్నారు.  ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీల పనితీరేం బాగా లేదు. వాటి ఉత్పాదకత కూడా అంతంతే ఉంది. అవి లాభాలను సాధించలేకపోతున్నాయి. స్వతహాగా నిలదొక్కుకోవడానికి అవసరమైన వనరులను అవి సమకూర్చుకోలేకపోతున్నాయి. అందుకే అవి పురోగతిని నమోదు చేయలేకపోతున్నాయి. ప్రభుత్వం సహకారం అందితేనే అవి అభివృద్ధి పథంలోకి రాగలుగుతాయి. సంపద సృష్టించే వనరుగా కంపెనీలు ఉండాలే తప్ప.. సంపదను హరించే వనరులుగా మారకూడదు’’ అని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ చైర్మన్ ఆర్.సి.భార్గవ పేర్కొన్నారు.

‘‘ప్రభుత్వరంగ కంపెనీల నిర్వహణతో ముడిపడిన విధివిధానాలు కూడా వాటి వైఫల్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన సమయంలో .. కంపెనీకి సంబంధించిన చాలా అనుమతుల కోసం పార్లమెంటరీ కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు కావడమనేది ఇండియాకే ప్రత్యేకమేం కాదు.. రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల్లోనూ జరిగిందిదే’’ అని ఆయన వివరించారు.