ఇండ్లు కట్టడానికి కేంద్రం ఇచ్చే పైసలు పక్కదారి
డబుల్ బెడ్ రూంలు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడి
పట్నం గోస కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి
హయత్ నగర్, వెలుగు: ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూములతో 10లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వొచ్చని కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. పట్నంగోస పేరుతో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమం మంగళవారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వహించారు. వనస్థలిపురం, మన్సూరాబాద్, నాగోల్, హయత్నగర్ లలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి కాకపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణమని, ప్రధాన మంత్రి ఆవాస్యోజన పేరుతో కేంద్రం ఇస్తున్న వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. గల్లీల్లో ఉండే టీఆర్ఎస్ నాయకులు ఈ పథకం పేరిట పైసలు వసూలు చేస్తున్నారన్నారు. అప్లై చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారో తెలియకుండా చేసేందుకే మీసేవలో దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతున్నారన్నారు. తహసీల్దార్ ఆఫీసుల కాడ అప్లికేషన్లు తీసుకుంటున్నమని చెప్తే నిజమైన లబ్ధిదారులు ఎంత మంది క్యూలో ఉంటారో కనబడుతారన్నారు. మన్సూరాబాద్లో 154మందికి డబుల్ బెడ్రూంలు కేటాయించి మళ్ళీ తాళాలు గుంజుకున్నారని. ఎందుకని అడిగితే కేటీఆర్ సార్ వచ్చి ఓపెన్ చేస్తారని చెబుతున్నారన్నారు. లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే అందరితో కలెక్టరేట్ముట్టడిస్తామన్నారు. ఎన్నిరోజులైనా అక్కడే ఉంటామని, అన్నం తిన్న ఆకులను కలెక్టర్ కుర్చీలో పెట్టి నిరసన తెలుపుతామన్నారు.
ప్రజల నమ్మకాన్ని మూసీలో కలిపిన సుధీర్రెడ్డి
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్, ఇంటి పన్నులు, ఆటో నగర్ చెత్త డంపింగ్ సమస్య లాంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకే తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారని, 6 నెలల్లో సమస్యలను పరిష్కరించకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారన్నారు. కానీ 8 నెలలు కావస్తున్నా ఏమీ చేయకుండా ప్రజల నమ్మకాన్ని మూసీలో కలిపి మూసీ రివర్ కార్పొరేషన్ చైర్మన్పదవి తెచ్చుకున్నారన్నారు. ఎమ్మెల్యే కు చిత్తశుద్ది ఉంటే హామీలు తీర్చి పదవి చేపట్టాలన్నారు. బస్తీ నుంచి మొదలు ప్రతి డివిజన్లో ఎమ్మెల్యే చేసిన మోసం గురించి వివరిస్తామన్నారు. పట్నం గోసలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తానన్నారు. హయత్ నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లో పేదలు, డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.