పార్టీ మారి ఏండ్లయినా చంద్రబాబు నామస్మరణే

పార్టీ మారి ఏండ్లయినా చంద్రబాబు నామస్మరణే
  • చంద్రబాబుకు దీవెనలివ్వమంటూ సభికులను కోరిన మంత్రి గంగుల
  • పల్లెప్రగతిలో తడబాటును  తప్పు సరిచేసుకున్న మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ తన మాజీ బాస్ ను ఇంకా మరచిపోనట్లుంది. ఇప్పటికీ టచ్ లో ఉన్నారో.. లేక తలచుకుంటున్నారో గాని సభా ముఖంగా చంద్రబాబు కు దీవెనలివ్వమంటూ కోరిన ఘటన ఒకింత కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో జరిగిన పల్లెప్రగతిలో మంత్రి తన ప్రసంగంలో చంద్రబాబుకు కడుపునిండా దీవెనలివ్వమంటూ తడబడ్డారు. మంత్రిగారి ప్రసంగంలోని పొరపాటును వేదికపై ఉన్న వారితో సహా సభికులందూ గుర్తించి ఆశ్చర్యపోవడం గమనించిన మంత్రి గంగుల తన ప్రసంగంలో పొరపాటును గుర్తించి సరిచేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది.

ఇంతకూ ఎలా జరిగిందంటే..
కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో హారితహారం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మొక్కలు నాటారు.  మహిళా సంఘం, గౌడ సంఘాల కోసం నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి సభలో ప్రసంగిస్తూ ‘‘ఇన్ని మంచి పథకాలిచ్చిన చంద్రబాబుకు కడుపునిండా దీవెనార్థులు పెట్టాలి’’ అని మంత్రి గంగుల కోరారు. మంత్రి తడబడి చేసిన పొరపాటు సభికులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే తన పొరపాటును గుర్తించిన మంత్రి గంగుల సీఎం కేసీఆర్ కు దీవెనార్థులీయాలంటూ  కోరారు. మంత్రి తడబాటుపై సభికులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.